ఐవోసీకి కరోనా దెబ్బ, 4 ఏళ్ల తర్వాత తొలిసారి రూ.5వేల కోట్ల నష్టం
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా చమురుకు డిమాండ్ తగ్గడం వంటి వివిధ కారణాలతో చమురురంగ కంపెనీలు నష్టాలు చవిచూశాయి. దేశీయ టాప్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మార్చి క్వార్టర్లో భారీ నష్టాన్ని నమోదు చేసింది. నష్టాలు నాలుగేళ్ల తర్వాత భారీ నష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయని, దీంతో మార్జిన్లు పడిపోయాయని, ఈ ప్రభావం జనవరి - మార్చి క్వార్టర్ పైన పడిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు. మార్చి క్వార్టర్లో చమురు ధరలు 65.6 శాతం పడిపోయాయి.
సంక్షోభంలో చమురు ఇండస్ట్రీ, క్రూడాయిల్ భద్రతపై చైనా వ్యూహం
రూ.5,185 కోట్ల నికర నష్టం
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రూ.5,185 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో రూ.6,100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్ష క్వార్టర్లో నిల్వలపై కంపెనీ రూ.14,692 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే సమయంలో నిల్వలపై రూ.2,655 కోట్ల లాభం వచ్చింది. బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా (స్థూల రిఫైనింగ్ మార్జిన్) 2019 జనవరి-మార్చిలో 4.09 డాలర్లు ఆర్జించగా, ఈసారి 9.64 డాలర్లు నష్టపోయింది. ఒకవేళ నిల్వలపై నష్టాలను మినహాయిస్తే 2.15 డాలర్లు ఆర్జించినట్లు అవుతుందని సంజీవ్ సింగ్ తెలిపారు.
వేగంగా కోలుకుంటుంది
కోరనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి నాటికి ఇంధన డిమాండ్ దేశంలో పడిపోయింది. ఇప్పుడు అమ్మకాలు పెరుగుతున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్కు కరోనా ముందు డిమాండ్కు రావాలంటే కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంధన డిమాండ్ ఊహించిన దాని కంటే ఎక్కువగానే కోలుకుంటుందని సంజీవ్ సింగ్ చెప్పారు.
జూలై చివరి నాటికి 100 శాతం
ఇంధన డిమాండ్ 80 శాతం నుండి 85 శాతం మేర పుంజుకుందని సంజీవ్ సింగ్ తెలిపారు. త్వరలో ఇది 90 శాతానికి చేరుకుంటుందని, 100 శాతానికి రావడానికి కాస్త సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం రిఫైనరీ 90 శాతం సామర్థ్యంతో ఉందని, జూలై చివరి నాటికి 100 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. దేశంలో ఐదు మిలియన్ బ్యారెల్స్ రిఫైనరీ సామర్థ్యం ఉండగా, ఇందులో మూడోవంతు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది.
ఐవోసీ లాభాలు..
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఐవోసీ నికర లాభం రూ.రూ.1,313 కోట్లకు తగ్గింది. 2018-19లో నికర లాభం రూ.16,894 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిల్వలపై రూ.12,531 కోట్ల నష్టం వచ్చింది. అదే 2018-19లో నిల్వలపై రూ.3,227 కోట్ల లాభాన్ని గడించింది. చైన్నై పెట్రోలియం.. ఐవోసీ అనుబంధ సంస్థ.