Stock Market Crash: స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. రూ.3.50 లక్షల కోట్లు ఆవిరి..
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం చెలరేగింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు అదే ధోరణిని కొనసాగించటంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల పెట్టుబడుల విలువను కోల్పోయారు. మార్కెట్లు పూర్తిగా బేర్ల చేతిలోకి జారుకున్నాయి.
మార్కెట్ సూచీలు..
స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 927 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 677 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 345 పాయింట్ల మేర నష్టపోయాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర ఆవిరైంది. కేవలం నేడు ఒక్కరోజు మాత్రమే రూ.3.50 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.
8 కీలక కారణాలు..
దేశీయ మార్కెట్లలో వరుస నష్టాలకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ముందుగా అమెరికా స్టాక్ మార్కెట్లలో నష్టాలు, డిసెంబరులో షేర్ల విక్రయాలు కీలకంగా ఉన్నాయి. ఇదే క్రమంలో రష్యా ప్రెసిడెంట్ న్యూక్రియల్ ఆయుధాల ట్రీటీని సస్పెండ్ చేయటం, రానున్న మీటింగ్ లో ఫెడ్ భారీగా వడ్డీ రేట్ల పెంపును కొనసాగిస్తుందనే విషయాలు కీలకంగా ఉన్నాయి. వీటికి తోడు అదానీ గ్రూప్ కు చెందిన 10 కంపెనీల షేర్లలో విక్రయాలు ఆగకపోవటం, రిజర్వు బ్యాంక్ మీటింగ్ మినిట్స్ కోసం దేశీయ ఇన్వెస్టర్లు ఎదురుచూడటం, మార్కెట్ సూచీల్లోని టెక్నికల్ కారణాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ డబ్బును ఇండియా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవటం, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా బాండ్ ఈల్డ్స్ పెరగటం మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
అదానీ షేర్లు..
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవటం వల్ల అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఏకంగా రూ.40,000 కోట్లు నష్టపోయారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ అత్యధికంగా 7 శాతం మేర నష్టపోయింది. జనవరి 25 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ కు చెందిన 10 కంపెనీల మార్కెట్ విలువ దాదాపుగా రూ.11.5 లక్షల కోట్ల నుంచి రూ.7.69 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం ఒక్క నెలలోనే దాదాపు 60 శాతం విలువను కోల్పోయాయి.
గెయినర్స్..
రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు నిఫ్టీ సూచీని నష్టాల్లోకి లాగాయి. అయితే ఫార్మా స్టాక్స్ బలహీనమైన సెషన్లో కొనుగోళ్లను చూశాయి. ప్రధానంగా అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే సమయంలో ఈ వేసవిలో వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అమ్మకాలు పెరుగుతాయని వార్తల వల్ల బ్రోకరేజీలు వోల్టాస్ స్టాక్ మీద సానుకూల ధోరణిని వెల్లడించాయి. ఈ క్రమంలో వోల్టాస్ మూడు రోజులుగా లాభపడుతోంది. ఈ రంగంలోని ఇతర కంపెనీల షేర్లు సైతం నేడు లాభపడ్డాయి. ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్ లాభపడిన వాటిలో ఉన్నాయి.
లూజర్స్..
మార్కెట్ల పతనంతో సెన్సెక్స్లోని 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ చార్టులో బజాజ్ ఫైనాన్స్ దాదాపు 3 శాతం నష్టపోయింది.