ఏమాత్రం సరిపోదు : భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక నిపుణులు ఏం చెప్పారంటే?
ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కానుందని, కరోనా వైరస్ కారణంగా నిస్తేజంగా ఉన్న కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు, డిమాండ్ భారీగా పెంచేందుకు ఇటీవలి ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం అంతంత మాత్రమేనని రూటర్స్ పోల్లో పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసులు 77 లక్షలు దాటాయి. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు నమోదైన దేశం మనదే. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 80 రోజులకు పైగా సుదీర్ఘ లాక్డౌన్ విధించింది. ఆ తర్వాత క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తోంది. ప్రభుత్వం, ఆర్బీఐ ఆర్థిక పునరుజ్జీవానికి ఎన్నో చర్యలు ప్రకటించాయి.
ఆ ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు: భారీగా తగ్గిన నియామకాలు, పెరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ఆర్థికవేత్తల అసంతృప్తి
లాక్ డౌన్ సమయంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం, ఇటీవల 10 బిలియన్ డాలర్ల మేర డిమాండ్ పెంచే చర్యలను ప్రకటించింది. అయితే పలువురు ఆర్థికవేత్తలు ప్రభుత్వ ప్యాకేజీపై పెదవి విరుస్తున్నారు. అక్టోబర్ 13 నుండి 21 వరకు నిర్వహించిన సర్వేలో 55 ఆర్థికవేత్తలు ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి నిరాశావాదంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం కంటే మరింత నిరాశావాదంగా ఉందన్నారు.
ఏమాత్రం సరిపోదు
39మంది ఆర్థికవేత్తల్లో 34మంది అంటే దాదాపు 90శాతం మంది కేంద్ర ప్రభుత్వ తాజా డిమాండ్ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవడానికి ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల వ్యయం, మూలధన వ్యయం పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్యలు ఆర్థిక వివేకంతో కూడుకున్నవని, కానీ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధికి ఊతమిచ్చే చర్య మాత్రం అంతంతేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మొదటి ఆర్థిక సంవత్సరంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన జీడీపీ రెండో త్రైమాసికంలో మైనస్ 10.4 శాతం, మూడో క్వార్టర్లో మైనస్ 5 శాతం నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.
26 ఆర్థిక వ్యవస్థల జీడీపీ డబుల్ మైనస్
ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 9.8 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. 55 దేశాల్లోని 26 ఆర్థిక వ్యవస్థలు 10 శాతం కంటే ఎక్కువ ప్రతికూలత నమోదు చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 9 శాతం, 5.7 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.