Russia: రష్యా విషయంలో వెనకడుగు వేస్తున్న ఇండియన్ బ్యాంక్స్.. కేంద్రం మాటలు నీటిమూటలేనా..?
Russia: రష్యా విషయంలో భారత ప్రభుత్వం చెబుతున్న మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ప్రత్యక్ష వాణిజ్య లావాదేవీల చెల్లింపులకు రూపాయి-రూబుల్ విధానాన్ని వినియోగించాలని నిర్ణయించాయి. చెల్లింపుల్లో డాలర్ పాత్రను తగ్గించేందుకు, ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తుంటే ఇవి కేవలం ఒప్పందాల వరకే పరిమితమైనట్లు కనిపిస్తోంది.
రాయిటర్స్ నివేదిక..
పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తాయనే భయంతో పెద్ద భారతీయ బ్యాంకులు రష్యాతో ప్రత్యక్ష లావాదేవీలను జరపటం నుంచి తప్పించుకుంటున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. వాణిజ్యాన్ని పెంపొందించేందుకు రెండు దేశాలు రూపాయి సెటిల్మెంట్ మెకానిజమ్ను అమలుచేసేందుకు SBI అంగీకరించిన నెలలోపే ఇది వెలుగులోకి వచ్చింది.
నో రెస్పాన్స్..
భారత్ కు చెందిన 8 పెద్ద బ్యాంకులు రూపాయి-రూబుల్ సెటిల్ మెంట్ నిర్వహించాలని రష్యా బ్యాంకులు అభ్యర్థించాయి. అయితే భారత బ్యాంకుల నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదని భారతీయ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. ఈ జాబితాలో SBI, PNB, BOI, BOB, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాయి. ఈ బ్యాంకుల ఉన్నతాధికారులు మాత్రం అమలు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఆంక్షల భయంతో..
రష్యాతో రూపాయిల్లో వ్యాపారం చేసినందుకు అమెరికా, యూరప్ చేత శిక్షింపబడుతున్నాయని ప్రభుత్వ రంగంలోని సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. తమపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించవచ్చని.. దానివల్ల బ్యాంక్ రెప్యూటేషన్, వ్యాపారం పెద్ద స్థాయిలో దెబ్బతింటాయని అన్నారు. డాలర్, యూరోలను కాదని రష్యాతో వ్యాపారం నిర్వహిస్తే తమ వ్యాపారాలకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు బ్యాంకులు మాత్రం..
ప్రస్తుతం రష్యాకు చెందిన PSCB, Gazprombank బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్న యస్ బ్యాంక్, UCO బ్యాంక్ మాత్రమే ప్రస్తుతం చెల్లింపు విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా డాలర్ను దాటవేయడానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. సెప్టెంబరులో భారతీయ బ్యాంకులకు ఖాతాలను తెరవడానికి రష్యన్ క్రెడిట్ సంస్థల నుంచి సుమారు 20 రిక్వెస్ట్స్ వచ్చాయని తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు.