టారిఫ్ తగ్గించాలి, చైనా నుండి కంపెనీలు రావాలంటే అందులో చేరాలి: ప్రభుత్వానికి అరవింద్
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. అగ్రరాజ్యం అమెరికా నుండి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏళ్లకు ఏళ్లు కుంచించుకుపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. సరికొత్త మార్పుకు ఈ కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా నీతి అయోగ్ మాజీ వైస్ చర్మన్ అరవింద్ పనగారియా ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
జంక్కు పైన భారత్ రేటింగ్, మూడీస్ రేటింగ్తో మన పరిస్థితేమిటి?
దిగుమతి సుంకాలు తగ్గించాలి, అందులో చేరాలి
భారతదేశం దిగుమతి సుంకాలను 7 శాతం మేర తగ్గించాలని, 15 మెంబర్స్ కలిగిన రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ (RCEP)లో చేరాలని అరవింద్ పనగారియా అన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు మంచి రోడ్డు మ్యాప్ ఉండాలన్నారు. పెట్టుబడుల కోసం భారత్ మరింత తెరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన సుంకాలను అన్ని వస్తువులపై కూడా 7 శాతం తగ్గించాలన్నారు.
చైనా నుండి కంపెనీలు రావాలంటే
ఉద్యోగాల సృష్టికి, తయారీకి షెన్జెన్ స్టయిల్ తరహా కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్స్ ఏర్పాటు చేయడంతో పాటు RCEP, ఈయూ, అమెరికా వంటి దేశాలతో ఒప్పందాలు ఉండాలని చెప్పారు. చైనా నుండి టెక్స్టైల్స్, పుట్వేర్, ఇతర రంగాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు రావాలంటే ఆసియా పసిఫిక్ భాగస్వాములతో కలిసి నడవాలని, RCEPలో చేరాలని సూచించారు.
పెద్ద మిస్టేక్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర భారత్ అని పిలుపునిచ్చారని, స్వావలంబన, స్వయం సమృద్ధి అంటే అది పూర్తిగా జరిగే పని కాదని అరవింద్ అభిప్రాయపడ్డారు. కాగా, ప్రముఖ ఆర్థికవేత్త జెఫెరీ సాక్స్ కూడా RCEP భారత్ చేరకపోవడాన్ని పెద్ద తప్పుగా చెప్పారు. ఇప్పుడు అరవింద్ పనగారియా కూడా ఇందులో చేరాలని సూచిస్తున్నారు. RCEP అనేది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల అసోసియేషన్. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, పిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సభ్యులుగా ఉన్నాయి. ఇండియా ఇందులో నుండి 2019లో బయటకు వచ్చింది.