లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏడాది కనిష్టానికి బంగారం దిగుమతులు.. మే నెలలో 99 శాతం క్షీణత
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం మార్చి నెల 24 నుంచి విధించిన లాక్ డౌన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే కోవలో మార్కెట్ల ఎగుమతులు, దిగుమతులు కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా పెట్టుబడి దారుల ప్రధాన వనరైన బంగారంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఏప్రిల్ నెలలో విదేశాల నుంచి భారీగా బంగారం దిగుమతులు తగ్గిపోగా.. మే నెలలోనూ అదే ట్రెండ్ కొనసాగింది. దీంతో మే నెలలో భారత్ బంగారం దిగుమతులు 99 శాతం మేర క్షీణించి ఏడాది కనిష్టానికి చేరిపోయాయి.
విలువ పరంగా చూస్తే గతేడాది మే నెలలో 4.78 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు.. ఈ ఏడాది మే నెలలో కేవలం 76.31 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో మే నెలలో దిగుమతులు కేవలం 1.4 టన్నుల మేర మాత్రమే నమోదయ్యాయి. గతేడాది మే నెలలో దిగుమతుల పరిమాణం 133.6 టన్నులుగా ఉంది.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల నుంచి విమాన సర్వీసులు, కార్గో సర్వీసులు రద్దు కావడం, ఇతర దేశాల్లోనూ బంగారం ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోవడం ఈ పరిణామాలకు కారణంగా తెలుస్తోంది. పలుదేశాల్లో వైరస్ వ్యాప్తి భయాలతో బంగారం గనుల్లో తవ్వకాలు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో పసిడి నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. జూలై తర్వాత వివిధ దేశాల్లో లాక్ డౌన్ సడలింపులు పెరిగితే తిరిగి దిగుమతులు ఊపందుకునే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.