Digital Rupee: దూకుడు పెంచిన భారత్.. చైనాకు ధీటుగా e-rupee.. పాకిస్తాన్ పనిపట్టేందుకేనా..?
Digital Rupee: భారత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున పైలట్ ప్రాజెక్ట్లను నిర్వహించిన తర్వాత తుది రూపకల్పనను ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కరెన్సీ చెల్లింపు మార్గాలకు ఇది అదనమని, ఉన్నవి అలాగే కొనసాగుతాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
రెండు విధాలుగా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్సేల్ విభాగానికి అకౌంట్ ఆధారిత CBDCని, రిటైల్ రంగానికి టోకెన్ ఆధారిత కరెన్సీని అమలు చేసే ఆప్షన్లను అన్వేషిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. డిజిటల్ కరెన్సీని ఈ-రూపాయిగా సూచిస్తారు.
అగ్ర దేశాల సరసన..
ఇప్పటి వరకు ఎక్కువగా ఫిజికల్ క్యాష్ పై ఆధారపడిన భారత్.. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కరెన్సీల డిజిటల్ వెర్షన్ తెస్తోంది. దీని కారణంగా చైనా వంటి దేశాల జాబితాలో మన దేశం కూడా చేరనుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలోనే తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రిజర్వు బ్యాంక్ ఈ సంవత్సరం డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్నట్లు చెప్పారు.
పారదర్శకత పెంచేందుకు..
ఈ రోజుల్లో అనేక ఆర్థిక నేరాలు బయటపడుతున్నాయి. మనీ లాండరింగ్ వంటి నేరాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి హవాలా ట్రాన్సాక్షన్లు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అదుపుచేయటానికి ఇది ఎంతగానే తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావటానికి, పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు సైతం ఇది దోహదపడుతుందని వారు అంటున్నారు. ఇది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల నిర్వహణ సులువుగా మారుతుందని క్రిప్టో ఎక్స్ఛేంజీలు చెబుతున్నాయి.
పాకిస్తాన్..
దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు విపరీతంగా చెలామణీలోకి వచ్చాయి. రిజర్వు బ్యాంక్ గణాంకాల ప్రకారం.. నకిలీ 500 రూపాయల నోట్ల సంఖ్య 102 శాతం పెరిగినట్లు మార్చిలో వెల్లడించింది. ఇదే సమయంలో నకిలీ 2000 రూపాయల నోట్ల సంఖ్య 55 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. వీటికి సూత్రధారులు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నట్లు అనేక మార్లు వెల్లడైంది. డీమానిటైజేషన్ సమయంలో పాకిస్తాన్ కేంద్రంగా ముద్రిస్తున్న పాత కరెన్సీ నోట్ల దందా వీడియోలు సైతం చాలానే మీడియాలో వచ్చాయి. ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి. దీని ద్వారా పాకిస్తాన్ ఆట కట్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.