పెట్రోలు పైనా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్: ఆరేళ్ళలో తొలిసారి తగ్గిన డిమాండ్
పాలకులు పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినా... భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఒక్కో అంశం స్పష్టం చేస్తోంది. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అసలు ఆర్థిక మందగమనమే లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పైగా అయన అసలు దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను కాపాడింది తమని గొప్పలు చెప్పుకొంటున్నారు. అదే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, అంత బాగుందనే ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ గణాంకాలు మాత్రం వారు చెప్పే మాటల్లో నిజం లేదని నిరూపితం చేస్తున్నాయి.
ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గిపోవటంతో తొలిసారి దేశంలో ఆర్థిక మందగమన ఛాయలు మొదలయ్యి. వెంటనే ఎఫ్ ఎం సి జి ఉత్పత్తులు, రిటైల్ సేల్స్ పడిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి పడకేసింది. లక్షల్లో ఉద్యోగాలు ఊగుతున్నాయి. తాజాగా పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది తేలింది. ఇది ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న సంకేతాలను స్పష్టం చేస్తోంది. అది కూడా ఆరేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోవటం గమనార్హం. ఈ విషయాలను ప్రభుత్వ విభాగాలు అంచనా వేయటం విశేషం. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
వృద్ధి 1 శాతమే...
భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ విభాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ తాజాగా దేశంలో పెట్రోలు సహా చమురు వినియోగం పై లెక్కలేసింది. దాని అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ కేవలం 1.3% మాత్రమే ఉండనుంది. మొత్తంగా దేశంలో సుమారు 216 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం జరగనున్నట్లు అంచనా వేసింది. దేశంలో ఇప్పటి వరకు కేవలం 2013-14 సంవత్సరంలో మాత్రమే పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ కనిష్టంగా 0.9% మేరకు నమోదు అయ్యింది. కానీ అప్పుడు దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ప్రపంచ ముడి చమురు ధరలు ఒక బారెల్ కు 100 డాలర్ల కు చేరుకోవటంతో ... కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురును డిమాండ్ తగ్గింది. కానీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ అలంటి పరిస్థితే నెలకొనబోతోంది. ఐతే ఇప్పుడు దేశేయా పరిస్థితుల కారణంగానే డిమాండ్ తగ్గుతోందని స్పష్టమవుతోంది.
గ్లోబల్ సంస్థలదీ అదే మాట...
వివిధ దేశాల్లో చమురు, ఇంధన వినియోగం పై పరిశోధన చేసి, డిమాండ్ అంచనాలు వెలువరించే గ్లోబల్ ఆర్గనైజషన్స్ కూడా అదే మాట చెబుతున్నాయి. ఫిచ్ సోలుషన్స్ అనే కంపెనీ భారత్ లో ఇంధన డిమాండ్ ఈ ఏడాది 3% నికి పడిపోతుందని అంచనా వేసింది. ఇదే సంస్థ కొంత కాలం క్రితం డిమాండ్ 5% ఉంటుందని చెప్పింది. కానీ దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితుల్లో తన అంచనాలను సవరించి 3% నికి తగ్గించింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా భారత్ లో రోజుకు సగటున 1,45,000 బారెల్స్ కు పడిపోతుందని అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది డిమాండ్ కాస్త పుంజుకొని అవకాశం ఉందని, అప్పుడు రోజుకు సగటున డిమాండ్ 1,80,000 బారెల్స్ కు పేరుగొచ్చని తెలిపింది.
మరింత తగ్గినా డీజిల్ వినియోగం...
దేశంలో పెట్రోలు కన్నా డీజిల్ వినియోగమే అధికంగా ఉంటుంది. రవాణా, వ్యవసాయం, పరిశ్రమల్లో డీజిల్ వినియోగం చాలా ఎక్కువ పరిమాణంలో జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని వినియోగం భారీగా పడిపోతోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ అంచనాల ప్రకారం ఇండియా లో డీజిల్ డిమాండ్ కేవలం 0.9% నికి పరిమఠం కాబోతోంది. అంటే ఆర్థిక వ్యవస్థ కు కీలకమైన అన్ని రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లోనూ ఆర్థిక మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నట్లే. అయినా సరే... దేశాన్ని ఏలే వారికి ఇవి ఏమాత్రం కనిపించటం లేదు. ఇప్పటికైనా ప్రధాని, ఆర్థిక మంత్రి సత్యాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి, ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.