బ్యాంక్ రీక్యాప్ను నిర్లక్ష్యం చేయవద్దు: ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
భారత బ్యాంకు రీక్యాపిటలైజేషన్పై నిర్లక్ష్యం వహించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సోమవారం అన్నారు. బ్యాంకులకు అదనపు మూలధనం కల్పించడాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రుణ మారటోరియం, వడ్డీ మాఫీలకు ఎనలేని ప్రధాన్యం ఇస్తుందన్నారు. ప్రస్తుతం బ్యాంకులకు రూ.9 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఇవి రెట్టింపయ్యే ఆస్కారం ఉందని చెప్పారు. అర్ధవంతమైన రికవరీ రావాలంటే బ్యాంకులకు అదనపు మూలధనం అవసరమన్నారు.
అవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలు
కానీ దీనిపై అవసరమైనంత దృష్టి లేదని, స్వల్పకాలిక లాభాల కోసం ఆర్థిక స్థిరత్వాన్ని పణంగా పెట్టిన చందంగా మారిందన్నారు. ఈ వైఖరి ప్రతికూల పరిణామాల నుండి భారత్ కోలుకోకుండా నిరోధించినట్లు అవుతుందన్నారు. మారటోరియం, వ్యవసాయ రుణాలకు క్షమాభిక్ష వంటి చర్యలు స్వల్పకాలంలో రుణగ్రహీతలకు అవసరానికి మించి చేయూత ఇచ్చినట్లు అవుతుందని, కానీ ఈ వైఖరి రుణాల వృద్ధిలో రికవరీని నిలువరిస్తుందన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల ఆరు నెలల పాటు మారటోరియం వెసులుపాటు కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వడ్డీపై వడ్డీని మినహాయించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో విరల్ ఆచార్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.