రికార్డ్ ధరలతో 9% తగ్గిన డిమాండ్: పెరిగిన ధరలకు అంగీకారం! సుంకం తగ్గిస్తే ఊరట
2019లో ఓ వైపు ఆర్థిక మందగమనం, మరోవైపు బంగారం వంటి విలువైన లోహాల ధరలు రికార్డ్ ధరకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పసిడికి గత క్యాలెండర్ ఏడాదిలో డిమాండ్ తగ్గింది. ఏకంగా 9 శాతం డిమాండ్ తగ్గి 690.4 టన్నులుగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గురువారం తమ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇది 760.4 టన్నులుగా ఉంది. 2019లో సెప్టెంబర్ నెలలో బంగారం ధర రూ.40వేలు దాటింది. అప్పటి నుంచి కాస్త అటు ఇటుగా రూ.39వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంది. 2018 చివరితో పోలిస్తే గత ఏడాది చివర పెరిగిన బంగారం ధర 24 శాతంగా ఉంది.
బడ్జెట్లో నిర్మలమ్మ శుభవార్త: డెబిట్ కార్డులపై MDR రద్దు
రీసైకిల్ చేసిన పసిడి వ్యాల్యూ 37 శాతం పెరిగింది
2019లో బంగారం ధరలు పెరగడంతో డిమాండ్ తగ్గింది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గడంతో పాటు దిగుమతులు కూడా పడిపోయాయి. 2018లో 755.7 టన్నలు దిగుమతి చేసుకోగా, 2018లో 646.8 టన్నులు భారత్ దిగుమతి చేసుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో పాటు రీసైకిల్ చేసిన పసిడి వ్యాల్యూ 37 శాతం పెరిగింది.
ధరలు, మందగమనం కారణం..
దేశీయంగా రికార్డ్ స్థాయిలో ధరలు పెరిగాయని, పైగా మందగమనం ఉందని, ఇవి పసిడి విక్రయాలపై భారీగా ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ అన్నారు. ధనత్రయోదశి వంటి శుభదినాల్లో కూడా కొనుగోళ్లు అంతగా లేవన్నారు. పెళ్లిళ్ల సీజన్ ముందు కాస్త పర్వాలేదనిపించిందన్నారు.
పెరిగిన ధరలను అంగీకరించడం.. సంస్కరణలు
2020లో బంగారానికి డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గత ఏడాది హఠాత్తుగా ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ తగ్గిందని, ఇప్పుడు ఆ పెరిగిన ధరల్లోనే కాస్త అటు ఇటుగా ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో పెరిగిన ధరలను అంగీకరించడంతో పాటు బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు తీసుకు వస్తే కొనుగోళ్లు పెరుగుతాయన్నారు.
అలా అయితే డిమాండ్ పెరగొచ్చు
2020లో బంగారానికి 700 నుంచి 800 టన్నుల డిమాండ్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన సెస్ 12.5 శాతాన్ని 10 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అలా అయితే డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం జ్యువెల్లరీకి డిమాండ్ తగ్గిందని WGC పేర్కొంది. గత ఏడాది 6 శాతం తగ్గి 2,107 టన్నులకు పడిపోయింది. కేవలం నాలుగో క్వార్టర్లోనే 2018తో పోలిస్తే 2019లో ఏకంగా 10 శాతం తగ్గింది.
ఇన్వెస్టర్లు ముందుకొచ్చినా..
ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ వంటి వివిధ కారణాల వల్ల సురక్షిత బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ 1 శాతం తగ్గింది.