ఆర్థిక మాంద్యంలోకి భారత్, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది: RBI నౌకాస్ట్లో ఆర్థికవేత్తలు
భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో మొదటిసారి ఆర్థిక మాంద్యంలోకి అడుగు పెడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో వరుసగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు క్షీణించిందని, దీని అర్థం భారత ఆర్థిక వ్యవస్థ టెక్నికల్గా మాంద్యంలోకి వెళ్లిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర సహా పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలోను ప్రతికూలత నమోదవుతుందని ఆర్బీఐ బులిటెన్లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
కేంద్రం పండుగ శుభవార్త: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు
టెక్నికల్గా మాంద్యంలోకి...
దేశ చరిత్రలో తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోందని ఆర్థిక నిపుణులు అన్నారు. వరుసగా రెండో క్వార్టర్లో వృద్ధి రేటు క్షీణించడం అంటే మాంద్యంలోకి జారుకున్నట్లేనని తెలిపారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో మొదటి క్వార్టర్లో వృద్ధి భారీగా పతనం కాగా, రెండో త్రైమాసికంలో 8.6 శాతం క్షీణత ఉంటుందని భావిస్తున్నారు. ఆర్బీఐ-నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలిపారు. టెక్నికల్గా భారత్ మాంద్యంలోకి వెళ్లిందని మానిటరీ పాలసీ డిపార్టుమెంటుకు చెందిన పంకజ్ కుమార్ పేర్కొన్నారు.
దశలవారీగా తిరిగి సాధారణస్థితికి
దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలును తిరిగి సాధారణ స్థితికి తీసుకు వస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించవచ్చునని పంకజ్ కుమార్ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంతో మే, జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుందని పేర్కొన్నారు. జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల కోసం ఆర్థికవేత్తలు, పరిశోధకులు నౌకాస్టింగ్ అనే విధానాన్ని ఉపయోగించారు. ఈ విధానంలో వేర్వేరు సమచారాలను విశ్లేషించి అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీటిని కచ్చితంగా ఆర్బీఐ అభిప్రాయాలుగా భావించవద్దు.
నవంబర్ చివరి వారంలో గణాంకాలు..
2020-21 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి గాను ఆర్బీఐ గణాంకాలు, అంచనాలను విడుదల చేయలేదు. నవంబర్ చివరి వారంలో అధికారిక జీడీపీ గణాంకాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంలో ఆర్థిక వ్యవస్థ 9.5 శాతానికి క్షీణించవచ్చునని గతంలో ఆర్బీఐ అంచనా వేసింది.