ఇంధనం, కరోనాపై ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు: మోడీపై ప్రశంసలు
అహ్మదాబాద్: ఇంధన రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ ఎనిమిదవ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఇంధనరంగంలో సూపర్ పవర్గా నిలబెట్టాలని, ఆర్థిక వ్యవస్థ పరంగానే కాకుండా స్వచ్ఛ ఇంధనం విషయంలోను భారత్ బలంగా ఎదగాలని అన్నారు. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ సాంకేతికతల్లో ఇంధన నిల్వ, వినియోగంలో కొత్త పరిష్కారాలను అన్వేషించాలన్నారు.
సంపన్నదేశంగా భారత్
ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణకు సంబంధించి వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని ముఖేష్ అంబానీ సూచించారు. భారత్ను ఆర్థిక, ఇంధనరంగాల్లో అగ్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలన్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ ఇంధన వినియోగం ఇప్పుడు ఉన్న దాంతో పోలిస్తే రెట్టింపు అవుతుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ ఇంధన విషయంలో బలమైన శక్తిగా ఎదగాలన్నారు.
ఇంధన రంగంలో ఊహించని మార్పులు ఉన్నాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఇంధన విప్లవాన్ని అనుసంధానించడంలో భారత్ విజయవంతమైతే ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు.
కరోనాపై అలసత్వం వద్దు
కరోనా తర్వాత ఆర్థికంగా భారత్కు ఎధుగుతుందని ముఖేష్ అన్నారు. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు స్థాపించే స్టార్టప్స్ కంపెనీలే వృద్ధికి చోదక శక్తిగా మారుతాయన్నారు. వచ్చే ఇరవై ఏళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డంకులు ఎదురైనా అధిగమించి ముందుకెళ్లే శక్తి భారత్కు, భారతీయులకు ఉందన్నారు. కరోనాతో పోరాటంలో కీలక దశలో ఉన్నామని, ఈ దశలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు.
ప్రధానిపై ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీపై ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. ఆయన బోల్డుగా తీసుకుంటున్న సంస్కరణలు భారత్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాయన్నారు. ప్రధానిలో ఉన్న నమ్మకం, భారత్కు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఈ సంస్కరణలు వేగవంతమైన భారత వృద్ధికి అవకాశం కల్పిస్తాయన్నారు.