చైనా పెట్టుబడుల నిబంధనలను మోడీ ప్రభుత్వం సులభతరం చేయనుందా?
చైనా పెట్టుబడులను భారత ప్రభుత్వం సులభతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. చైనా నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలుగా నిబంధనలను సులభతరం చేయాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భారత్.. డ్రాగన్ దేశ పెట్టుబడులపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రూ.45వేల కోట్ల పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
చైనీస్ పెట్టుబడులపై నియంత్రణలను సడలించాలని భారత్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోందని బ్లూమ్బర్గ్ న్యూస్ మంగళవారం నివేదించింది. ప్రస్తుతం భారత్తో భూసరిహద్దును పంచుకునే దేశాల్లోని కంపెనీల నుండి పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అంటే అవి ఆటోమేటిక్గా రావడం కుదరదు. విదేశీ యాజమాన్యం 10 శాతం కంటే తక్కువగా ఉన్న కంపెనీల ప్రతిపాదనలను మినహాయించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందని పేర్కొంది.
ఆరు బిలియన్ డాలర్లు లేదా రూ.45వేల కోట్ల పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదనను వచ్చే నెల ప్రారంభంలో ఆమోదించవచ్చునని భావిస్తున్నారు. 2020లో భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇరువైపుల సైనికులు మృత్యువాత పడ్డారు. దీంతో చైనాపై గుర్రుగా ఉన్న మోడీ ప్రభుత్వం ఆ దేశ కంపెనీలపై పరోక్షంగా ఆంక్షలు విధించింది. దేశంలో సున్నితమైన రంగాలలో చైనా పెట్టుబడులను పరిమితం చేయాలని అప్పుడే నిర్ణయించింది. చైనా మొబైల్ యాప్స్పై చర్యలు, చైనా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.