2047 నాటికి అమెరికా, చైనాల వలె సంపన్న దేశంగా భారత్: అంబానీ
2047 నాటికి అమెరికా, చైనాల సరసన సంపన్న దేశంగా భారత్ చేరుకుంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఇదే లక్ష్యంగా మనం పని చేయాలన్నారు. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్.. అమెరికా, చైనాల కంటే సంపన్న దేశంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్ల క్రితం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలు అసామాన్యమైనవన్నారు. అయితే ఈ సంస్కరణల ఫలాలు దేశంలోని ప్రజలందరికీ దక్కలేదన్నారు. అట్టడుగు వర్గాల్లో సంపద సృష్టి జరిగేలా భారతీయ నమూనాను అభివృద్ధి చేయాలని ఓ ఆంగ్ల పత్రికు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
సంస్కరణల ఫలితం
పీవీ నరసింహారావు 1991లో చేపట్టిన సంస్కరణలను ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ దిశ, గమ్యాన్ని మార్చేలా దూరదృష్టితో కూడిన నిర్ణయాలను తీసుకున్నారని, నాలుగు దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రభుత్వ రంగానికి సమానంగా ప్రయివేటు రంగానికి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యం కల్పించిందన్నారు. లైసెన్స్ రాజ్కు ముగింపు పలికారన్నారు. పారిశ్రామిక విధానాలను సరళీకరించినట్లు చెప్పారు. క్యాపిటల్ మార్కెట్స్, ఆర్థిక రంగాల్లో సామర్థ్యాలు పెంపొందించే సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఈ సంస్కరణలు ప్రపంచంలో భారత్ అయిదో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. 1991లో నుండి జనాభా పెరిగినప్పటికీ పేదరికం రేటు సగానికి తగ్గిందని, ఇది సంస్కరణల ఫలితమే అన్నారు.
విదేశీ మారక నిల్వలు
1991లో భారత జీడీపీ 26,600 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని, ఇప్పుడు పది రెట్లు పెరిగి 2.87 లక్షల డాలర్ల స్థాయికి చేరుకుందని ముఖేష్ అంబానీ అన్నారు. విదేశీ మారక ద్రవ్యం కోసం వెతుకులాడే పరిస్థితి నుండి 61,200 కోట్ల డాలర్ల నిల్వలు ఉన్నాయన్నారు. 2051 నాటికి భారత్ ఆర్థిక సమానత్వం కలిగిన ప్రపంచ సంపన్న దేశంగా మారాలన్నారు.
వేగంగా వృద్ధి చెందుతూ..
తక్కువ సాంకేతికతో కూడిన కార్యకలాపాల్లో భారత్ అత్యంత వినూత్న దేశమన్నారు. శరవేగ వృద్ధికి దోహదపడేలా ఆధునిక సాంకేతిక వినియోగంలోను ఈ శక్తి సామర్థ్యాల్ని పదర్శించాల్సిన ఉందని చెప్పారు. అత్యుత్తమ నాణ్యతతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో సేవలు, ఉత్పత్తులను అందించేందుకు ఆవిష్కరణలు తోడ్పడ్డాయని తెలిపారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్తువుల ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని చెప్పారు.