మ్యూచువల్ ఫండ్ కంపెనీలు విలీనమైతే ఇన్వెస్టర్లపై ప్రభావం ఎలా ఉంటుంది?
విభిన్న రకాల కారణాలలో కంపెనీలు, ఆర్ధిక సంస్థలు విలీనం అవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఆయా సంస్థలు తెచ్చిన వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఏవిధంగా ప్రభావితం అవుతాయోనని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే విలీన ప్రక్రియ చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యాంకులు, కంపెనీల విలీనం జరిగే సందర్భంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో ముందుగానే చెబుతారు. కాబట్టి ఇన్వెస్టర్లు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీల విలీనం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో తాము పెట్టుబడులు పెట్టిన పథకాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !
ఎలా ఉంటుంది?
* తమ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాలను విలీనం చేస్తున్నట్టు ఇటీవలే బరోడా మ్యూచువల్ ఫండ్, బీఎన్పీ పరిబాస్ మ్యూచువల్ ఫండ్ లు ప్రకటించాయి. ఈ కంపెనీల విలీనానికి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
* రెండు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు విలీనం అవుతున్నాయంటే ఆయా కంపెనీలకు చెందిన ఒకే రకమైన పథకాలు కూడా విలీనం అవుతాయని అర్థం.
* సెబీ తీసుకువచ్చిన కేటగిరైజేషన్ స్కీం నిబంధనలు ప్రకారం మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రతి కేటగిరీలోను కేవలం ఒక ఓపెన్ ఎండెడ్ స్కీం ను కలిగి ఉండాలి. ఈ మేరకు విలీనం అయ్యే కంపెనీ ఒకేరకమైన కేటరిగీ కిందకు వచ్చే పథకాలను విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
* ఒకవేళ ఒక స్కీం ఫండమెంటల్స్ లో ఏమైనా మార్పు ఉంటే ప్రతిపాదిత మార్పు గురించి ఇన్వెస్టర్లకు నోటీసు ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అవసరమైతే అప్పటి వరకు ఉన్న నికర ఆస్థి విలువ (ఎన్ ఏ వీ ) ప్రకారం ఆ స్కీం నుంచి ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా ఎగ్జిట్ అయ్యే సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది.
ఇన్వెస్టర్ల అనుమతి అవసరమా?
* మ్యూచువల్ ఫండ్ కంపెనీ బోర్డు, ట్రస్టీల అనుమతి ఉంటె చాలు విలీన ప్రతిపాదనను సెబీకి పంపుతారు. సెబీ అనుమతి లభించినట్టయితే వెంటనే మ్యూచువల్ ఫండ్ యూనిట్ లను కలిగిన ఇన్వెస్టర్లకు నోటీసులు పంపుతారు.
* ఈ నోటీసులో విలీనం, దాని వల్ల కలిగే పరిణామాల గురించి తెలియజేస్తారు. ఫలితంగా ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టిన పథకంలో కొనసాగాలా లేక దాని నుంచి వైదొలగాలా అన్న నిర్ణయం తీసుకోవచ్చు.
అన్ని చూసుకోవాలి...
* విలీనం లేదా కొనుగోలు జరిగిన సందర్భంలో ఇన్వెస్టర్లు ఆ విలీనంలోని వివిధ అంశాలను పరిశీలించాలి. విలీన సంస్థ సామర్థ్యాలు మదింపు చేసుకోవాలి.
* కంపెనీల విస్తృతి ఏవిధంగా ఉంది, యాజమాన్య బలాబలాలు చూడాలి. కొనుగోలు చేస్తున్న కంపెనీ తెచ్చిన పథకాలు, దాని వ్యూహాలు, పెట్టుబడి దృక్పథాలు చూసుకోవాలి.
* ఒక పథకాన్ని మరో పథకంలో విలీనం చేసినప్పుడు ఇప్పటికే ఉన్న యూనిట్లకు బదులుగా కొత్త యూనిట్లను జారీ చేసే అవకాశం ఉంటుంది. అప్పడు పన్నుకు సంబందించిన సమస్య ఏమీ ఉండదు.
* పథకంలో కొనసాగాలా వద్ద అన్న నిర్ణయం తీసుకోవడానికి ఇన్వెస్టర్కు నెల రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఒక వేళ స్కీం నుంచి వైదొలగాలనుకుంటే ఎలాంటి ఎగ్జిట్ చార్జీలు చెల్లించకుండా వైదొలగవచ్చు.
* విలీనాల సందర్భంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయని భావిస్తే ఆయా సంస్థలను సంప్రదించి తగిన సమాచారం పొందడానికి ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది.