బెంగళూరులో ఆఫీస్లు వెలవెల, అమెరికా దిగ్గజ కంపెనీలపై ప్రభావం
భారత్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇప్పటి వరకు దేశంలో 2.14 కోట్లకు పైగా కేసులు నమోదు కాగా, 2.34 లక్షల మరణాలు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ మానుష్యుల ప్రాణాలు హరించడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. సామాన్యుల నుండి కుబేరుడి వరకు, చిన్న చిన్న వ్యాపారుల నుండి దిగ్గజ సంస్థల వరకు కరోనా వల్ల దెబ్బతింటున్నాయి. భారత ఐటీ నగరం బెంగళూరు ఇటీవల వెలవెలబోతోంది.
కార్యాలయాల మూత... బెంగళూరు వెలవెల
కరోనాకు ముందు ఈ నగరం ఐటీ సంస్థలతో పాటు ఎన్నో ప్రపంచ దిగ్గజ కార్యాలయాలతో కళకళలాడింది. అంతకుముందు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ బ్యాక్ ఆఫీస్గా ఉండింది. పాండమిక్కు ముందు గ్లాస్&స్టీల్ టవర్లతో వేలాదిమంది ఉద్యోగులతో కనిపించేది.
గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ ఇంక్, యూబీఎస్ గ్రూప్ ఏజీ వంటి దిగ్గజాలు రిస్క్ మేనేజ్మెంట్ మొదలు కస్టమర్ సర్వీస్, కంప్లియెన్స్ వరకు కీలక పాత్ర పోషించాయి. కానీ ఇప్పుడు బెంగళూరులో చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి. దేశంలో ఇటీవల కేసుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాల్ స్ట్రీట్ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు నెలల తరబడి వర్క్ ఫ్రమ్ హోంకు పరిమితమయ్యాయి.
కరోనా, ఉద్యోగుల ఆందోళన
దిగ్గజ కంపెనీల ఉద్యోగులకు కరోనా సోకడం కూడా ఆందోళన కలిగిస్తోంది. భారత్లోని తమ 20వేల మంది సిబ్బందిలో 800 మందికి సోకినట్లు స్టాండర్డ్ చార్టర్డ్ గతవారం ప్రకటించింది. మరోవైపు యూబీఎస్లో 25 శాతం వరకు ఉద్యోగులు గైర్హాజరయ్యారు. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనలోను ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్లోని వెల్స్ ఫోర్గో అండ్ కంపెనీస్ కార్యకలాపాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా ఉన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బ్యాంకులు టెక్నికల్ అంతరాయాలను అధిగమిస్తున్నాయి. కరోనా కేవలం భారత్ సమస్య మాత్రమే కాదని, ప్రపంచ సమస్య అని చెబుతున్నారు.
కరోనా మరింత తీవ్రతరం
5 మిలియన్ల ఉద్యోగులతో భారత్లో 194 బిలియన్ డాలర్ల ఔట్ సోర్సింగ్ ఇండస్ట్రీ నాస్కాం కార్యకలాపాలపై కరోనా ప్రభావం మరీ అంతగా ఉండదని అభిప్రాయపడింది. దేశంలో ప్రస్తుతం 2 కోట్లకు పైగా కరోనా కేసులు ఉన్నాయి. ఏప్రిల్ నెల నుండి 70 లక్షల కేసులు పెరిగాయి. టెక్ సిటీ బెంగళూరు.. కర్నాటక రాష్ట్ర రాజధాని. ఈ కర్నాటకలో గత ఇరవై నాలుగు గంటల్లో 50వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న కొద్ది వారాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై చివరి నాటికి 1,018,879 మరణాలు ఉంటాయని ఒక అంచనా. ప్రస్తుతం మరణాలు 2.30 లక్షలు ఉన్నాయి. కరోనా వేవ్ ఉధృతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
వర్క్ తరలింపు
భారత ఆర్థిక కార్యకలాపాలకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు కీలక నగరాలు. ఈ ప్రాంతాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభం భారత 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాక్ ఆఫీస్ యూనిట్లు పార్ట్ టైమ్ వర్కర్లను నియమించుకోవడం లేదా ఉద్యోగులను మల్టిపుల్ రోల్స్లో ఉపయోగించుకోవడం చేస్తున్నాయి.
ఓవర్ టైమ్ చేస్తున్న వారు ఉన్నారు. తక్కువ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పక్కన పెడుతున్నారు. ఇక్కడి కొంత పని పిలిప్పీన్స్కు బదలీ అవుతోందని వెల్స్ ఫార్గో ఉద్యోగి చెబుతున్నారు. అక్కడి సిబ్బంది అర్ధరాత్రి కూడా వర్క్ చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించవలసి ఉంది ముంబై, హైదరాబాద్, పుణేలలో ఉద్యోగులు గైర్హాజరు కావడంతో యూబీఎస్లో పనిని పోలాండ్కు తరలించారట. మొత్తానికి యూబీఎస్, వెల్స్ ఫోర్గో సహా వివిధ కంపెనీల్లో ఉద్యోగులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వర్క్ను తరలిస్తున్నారు.