74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
ముంబై: HDFC బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యపురి బ్యాంకులోని తన మెజార్టీ వాటాలను విక్రయించారు. ఈ మేరకు 7.42 మిలియన్ వాటాలు అమ్మివేసినట్లు ఎక్స్చేంజీలకు తెలిపింది. దీంతో బ్యాంకులో ఆయన షేర్ వ్యాల్యూ 0.13 శాతం నుండి 0.01 శాతానికి తగ్గింది. జూలై 21వ తేదీ నుండి జూలై 23వ తేదీ మధ్య ఆదిత్యపూరి షేర్లు విక్రయించారు. వీటి వ్యాల్యూ రూ.843 కోట్లుగా తెలుస్తోంది. ఆయన వాటాలు విక్రయించడంతో ఈ ప్రభావం షేర్లపై పడింది.
శిబూలాల్ కీలక నిర్ణయం, ఇన్ఫోసిస్లో 85 లక్షల షేర్లు విక్రయం: ఎందుకంటే
పడిపోయిన హెచ్డీఎఫ్సీ షేర్ ధర
7.42 మిలియన్ల షేర్లు విక్రయించిన అనంతరం ఆదిత్యపురి వద్ద 3.76 లక్షల షేర్లు లేదా 0.01 శాతం వాటా ఉంది. షేర్లను విక్రయించాడని తెలియడంతో సోమవారం HDFC బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.11.15 సమయానికి దాదాపు 3 శాతం మేర పడిపోయి రూ.1,086.15 వద్ద ట్రేడ్ అయింది. HDFC బ్యాంకు షేర్ గత మూడు నెలల కాలంలో 16 శాతం ఎగిసింది. కానీ ఈ రోజు రూ.30కు పైగా పడిపోయింది.
1994 నుండి...
1994లో HDFC బ్యాంకును ప్రారంభించినప్పటి నుంచి ఆద్యిత్యపురి ఆ బ్యాంక్ ఎండీగా ఉంటున్నారు. HDFC బ్యాంకు బలమైనశక్తిగా ఆవిర్భవించింది. ఈ అక్టోబర్ నెలలో ఆదిత్యపురి ఆ పదవి నుంచి వైదొలుగుతున్నారు. ఆయన వారసుడి కోసం వేట కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయన బ్యాంకులో తన వాటా 0.14 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించుకున్నారు. ఆయనకు బ్యాంకులో 77.96 లక్షల షేర్లు ఉన్నాయి. ఇందులో 74.20 లక్షల షేర్లు విక్రయించారు. మిగిలిన 3.76 లక్షల షేర్ల వ్యాల్యూ రూ.42 కోట్లుగా ఉంది.
బ్యాంకు ఏం చెప్పింది?
ఆదిత్యపురి షేర్ల విక్రయంపై HDFC బ్యాంకు ప్రతినిధి స్పందించారు. ఆ షేర్ల వ్యాల్యూ ప్రస్తుత ధర వద్ద రూ.843 కోట్లుగా ఉందని వెల్లడించారు. ఈ షేర్లను కూడా ఆదిత్యపురికి వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ధరల వద్ద కేటాయించినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పలు ధరల వద్ద ఈ షేర్లను కేటాయించామని, ముఖ విలువకు షేర్లు ఇవ్వలేదని బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. అందువల్ల ఈ నెట్ అమౌంట్ను రూ.843 కోట్లు కాదని, షేర్ అక్వైజేషన్ కాస్ట్, ట్రాన్సాక్షన్స్ పన్ను వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.