మరో రూ 45,000 కోట్లు ఇస్తారా... గండం గట్టెక్కుతాం: ఆర్బీఐకి ప్రభుత్వ విజ్ఞప్తి
ముసురుకుంటున్న ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం మరోసారి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ను ఆశ్రయిస్తోంది. అంతకంతకూ పడిపోతున్న రాబడులు, పన్ను వసూళ్లతో ఏం చేయాలో అంతుబట్టని కేంద్రం ... ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే రిజర్వు బ్యాంకు ఒక్కటే దిక్కు అని గుర్తించింది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ముగిసే లోగ... రూ 45,000 కోట్ల నిధులు విడుదల చేయాలనీ ఆర్బీఐని విజ్ఞప్తి చేస్తోంది. సమయానికి చెల్లింపులు చేయాలంటే కేంద్రానికి మరో మార్గం కనిపించటం లేదు. అందుకే ఈ మొత్తం నిధులను మధ్యంతర డివిడెండ్ రూపంలో వెంటనే చెల్లించాలని కోరుతోంది. ఈ విషయాన్నీ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ ఒక కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత డివిడెండ్ ప్రకటిస్తుంటుంది. కానీ ఈ సారి భారత జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ళ కనిష్ఠానికి పడిపోవటంతో అసాధారణ పరిస్థితుల నేపథ్యం లో ఆర్బీఐ ని మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కోరుతున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఆర్థిక నిపుణులతో మోడీ కీలక భేటీ, సీతారామన్ ఎందుకు రాలేదు?
రూ 1.48 లక్షల కోట్లు...
ఇదిలా ఉండగా ఇప్పటికే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ తో పాటుగా పరిమితి కంటే అధికంగా ఉన్న నిధుల్లో వాటాను కూడా చెల్లించింది. ఇలా 1.48 లక్షల కోట్ల అదనపు నిధులతో కలుపుకుని మొత్తంగా రూ 1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. అప్పట్లో ఈ అంశంపై పెద్ద దుమారమే లభించింది. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి శకునం కాదని చాలా మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ..... ప్రభుత్వ ఒత్తిడికి లొంగిన ఆర్బీఐ అంత భారీ మొత్తం నిధులను ప్రభుత్వానికి అందించింది. అది కూడా అసాధారణ నిర్ణయంగానే పరిగణించారు. కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా మూడోసారి...
ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఆర్బీఐ మరోసారి మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తే... వరుసగా మూడోసారి ఇలా చేసినట్లు అవుతుంది. అదే జరిగితే ఇకపై కూడా ప్రతి ఏడాది ఇలాగె ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు రాగలవని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా గతేడాది ఆర్బీఐ రూ 1.23 లక్షల కోట్ల రాబడిని ఆర్జించింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఆర్బీఐ ఆర్జించిన నికర లాభంలో అధిక మొత్తం ప్రభుత్వానికి బదలాయించవచ్చని సూచించింది. అందుకనుగుణంగా ఆర్బీఐ నిధుల్ని డివిడెండ్ రూపంలో చెల్లిస్తోంది.
11 ఏళ్ళ కనిష్టం..
ఇదిలా ఉండగా... భారత ఆర్థిక వ్యవస్థ గత 11 ఏళ్లలో కనిష్ట స్థాయి జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రపంచ బ్యాంకు కూడా మన దేశ జీడీపీ 5% మేరకు ఉండనుందని ప్రకటించింది. దేశంలో అమ్మకాలు క్షీణిస్తున్నాయి. అన్ని రకాల ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ తగ్గిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దెందుకు ప్రభుతం అనేక చర్యలు చేపట్టేందుకు సంసిద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టె బడ్జెట్ లో అనేక తాయిలాలు ప్రకటించి అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ కూడా తనవంతుగా ఇప్పటికే వరుసగా ఆరు సార్లు కీలక వడ్డీ రేట్లు తగ్గించి మూలుగుతున్న ఎకానమీ కి కొంత ఊపిరిలూదారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవటంతో ఆర్థికవేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిక మరోసారి ప్రభుత్వం ఆర్బీఐ వైపు చూస్తుండటం ఆందోళనలకు మరింత బలం చేకూరుస్తోంది.