నాటి బాండ్స్.. నేడు చెల్లింపులు..: పెట్రోల్, డీజిల్ ద్వారా ఆదాయం 48% జంప్
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలంలో భారీగా పెరిగింది. దాదాపు యాభై శాతం పెరగడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై కాలంలో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి రూ.1 లక్ష కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన మొత్తం రూ.67,895 కోట్లు. అంటే మొదటి నాలుగు నెలల కాలంలో అదనంగా రూ.32,492 కోట్లు లేదా 48 శాతం పెరిగాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో చమురు బాండ్స్కు ప్రభుత్వం కట్టాల్సిన రూ.10 వేల కోట్ల కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆయిల్ బాండ్స్కు కేంద్రం రూ.10వేల కోట్లు చెల్లించాలి. ఈ నాలుగు నెలల కాలంలో సింహభాగం పెట్రోల్, డీజిల్ పైన సుంకాల ద్వారా వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి, భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునే కొద్ది సేల్స్ మరింత పెరిగితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి వసూళ్లు అదనంగా రూ.1 లక్ష కోట్లకు పైగానే ఉండవచ్చునని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
యూపీఏ ప్రభుత్వం రూ.1.34 లక్షల కోట్ల బాండ్స్
సబ్సిడీ ధరలపై వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ మొదలైనవి విక్రయించడం వల్ల ప్రభుత్వరంగ చమురు కంపెనీలకు వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు గత యూపీఏ ప్రభుత్వం వాటికి రూ.1.34 లక్షల కోట్ల విలువ చేసే బాండ్స్ను జారీ చేసింది. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం వీటికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం రూ.10,000 కోట్లు చెల్లించాలి. ఆయిల్ బాండ్స్కు చెల్లించాల్సిన మొత్తం కంటే కేవలం నాలుగు నెలల్లోనే మూడు రెట్లు అదనంగా సమకూరడం గమనార్హం. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువుపై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు.
నాటి బాండ్స్... నేడు చెల్లింపులు
గత కాంగ్రెస్ (యూపీఏ) హ యాంలో ఇంధనం రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి నాటి ప్రభుత్వం రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్స్ జారీ చేసింది. ఇందులో రూ.3500 కోట్ల అసలు కింద కేంద్రం చెల్లించింది. మిగతా రూ.1.3 లక్షల కోట్లు వచ్చే అయిదేళ్లలో (2025-26) నాటికి చెల్లించవలసి ఉంది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ పేర్కొంది. వరుస ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఇలా ఉంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.31,150 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.52,860.17 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.36,913 కోట్లు చెల్లించాలి. ఈ భారానికి తగినట్లుగా పెట్రో ఉత్పత్తులపై ఆదాయం భారీగానే సమకూరుతోంది. 2020-21 మధ్య పెట్రోల్, డీజిల్ పైన రూ.3.35 లక్షల కోట్లు వచ్చింది. అంతకుముందు ఏడాది ఇది రూ.1.78 లక్షల కోట్లు.
ధరలు తగ్గితే...
సాధారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయ చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను పెంచుతాయి. అక్కడ ధరలు తగ్గితే, ఇక్కడ ధరలు తగ్గుతాయి. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను సవరిస్తాయి. అయితే ఇటీవల అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలీ చేయడం తగ్గింది. దీంతో ఆదాయం పెరిగింది. చమురు ధరలు తగ్గించాలని విపక్షాలు, వినియోగదారులు కోరుతున్నారు.