LICలో 25% వాటా విక్రయం, త్వరలో కేబినెట్ ముందుకు!
ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూకు ప్రభత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఒకేసారి కాకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దశల వారీగా ఎల్ఐసీ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎల్ఐసీ ఈక్విటీలో 25 శాతం వాటాను విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్లో తెలిపారు. రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత ఐపీవో చరిత్రలో అతిపెద్ద ఐపీవో కానుందని భావిస్తున్నారు.
ఎల్ఐసీలో దశలవారీగా 25 శాతం వాటాను విక్రయించే యోచనలో కేంద్రం ఉందని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడం, ద్రవ్యలోటు 3.5 శాతానికి చేరుకోవడం కేంద్రాన్ని కలవరానికి గురి చేస్తోంది. ఈ లోటును పూడ్చుకోవడానికి పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలో వెళ్ళవచ్చు. ఇందులో భాగంగా ఎల్ఐసీలో 25 శాతం వాటా విక్రయ ప్రతిపాదనకు కేబినెట్ అనుమతిని తీసుకోనుంది.
హౌసింగ్ ధరలు మరింత తగ్గుతాయా? హైదరాబాద్లో పెరిగిన సేల్స్: మరో 12 నెలలు కొనవచ్చు
మార్కెట్ పరిస్థితులు కుదటపడిన తర్వాత వాటాలు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు స్పందించాల్సి ఉంది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.2.1 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం భావించినప్పటికీ, కరోనాతో దెబ్బపడింది. ఇప్పటి వరకు కేవలం 5,700 కోట్లు మాత్రమే సమీకరించింది.
ఎల్ఐసీ షేర్ల విక్రయానికి డెలాయిట్ తోమత్సు ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎల్ఐసీ మార్కెట్ వ్యాల్యూను అంచనా వేసి సంస్థ ఆర్థిక నివేదికను తయారు చేయడంలో ఈ రెండు సలహాదారులుగా వ్యవహరిస్తాయి. ఎల్ఐసీ 25 శాతం వాటాను 20 బిలియన్ల షేర్లుగా విభజించనున్నారు.