పండుగకు ముందే ప్యాకేజీ! ఈ రంగాలకు కేంద్రం భారీ ఊరట
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్యాకేజీ ప్రకటించనుందని ఇదివరకే ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. సంస్థలకు, వ్యక్తులకు ఆర్థిక ప్యాకేజీ లేదా డిమాండ్ పెరిగేలా కేంద్రం వరుసగా ప్యాకేజీలు ప్రకటిస్తోంది. గతంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం, ఇటీవల ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీకీ క్యాష్ వోచర్ ప్రయోజనం కల్పించింది.
అవసరమైతే మళ్లీ ప్యాకేజీ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ప్రకటించారు. అలాగే, కేంద్ర అధికారులు కూడా ప్యాకేజీ రానుందని తెలిపారు. అయితే ఈ ప్యాకేజీ దీపావళికి ముందు లేదా కాస్త అటు ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ప్యాకేజీ: ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఫోన్ల ధర తగ్గింపు... కేంద్రం ఏం ప్రకటన చేయవచ్చు?
మరో విడద ప్యాకేజీ ఇందుకోసం..
సెకండ్ వేవ్ లేకుంటే కరోనా అంశానికి సంబంధించి కాస్త క్లారిటీ వచ్చినట్లుగా భావించవచ్చు. కరోనా కేసులకు సంబంధించి క్లారిటీ వస్తే ప్యాకేజీ ప్రకటించిందుకు అనువుగా ఉంటుందని పలువురు భావించారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో విడత ప్యాకేజీ రావొచ్చునని ప్రకటించవచ్చునని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు ఉద్దీపన పథకాలను ప్రకటించింది. నాలుగో ఉద్దీపన పట్టణ మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఆతిథ్య, పర్యాటక రంగాలకు సంబంధించి ఉండవచ్చునని అంటున్నారు. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు రూ.35,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసే యోచనను విరమించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వీటికి ప్రోత్సాహం
పట్టణ మౌలిక వసతులు, ఆతిథ్య, పర్యాటక రంగాలతో పాటు తయారీ ఆధారిత ప్రోత్సాహకాలకు ప్యాకేజీ విస్తరిస్తుందని భావిస్తున్నారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మార్చిలో గరీబ్ కళ్యాణ్ యోజన, ఆ తర్వాత ఆత్మనిర్భర్ భారత్, ఇటీవల ఎల్టీకీ స్కీం ప్రవేశ పెట్టింది. ఉద్యోగ, ఉపాధి కల్పన, డిమాండ్ పెంపు లక్ష్యంగా ఈ ప్యాకేజీలను ప్రకటించారు.
వీటికి ప్రాధాన్యత
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్నవాటిలో పర్యాటక, ఆతిథ్య రంగాలు ఉన్నాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ప్రయాణ, పర్యాటక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లకు పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. దేశంలో వీటికి మద్దతు ఇచ్చేందుకు కేంద్రం ప్యాకేజీ ఉండవచ్చునని అంటున్నారు. తాజా ఉద్దీపన ప్యాకేజీలో ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు.