పన్నుచెల్లింపుదారులకు కేంద్రం గుడ్న్యూస్: డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ దెబ్బ తీవ్రంగా పడుతోంది. అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించడం, వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ను సైతం అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. రవాణా, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని ఊరడింపు చర్యలను చేపడుతోంది. ప్రత్యేకించి- పన్నుచెల్లింపుదారులు, కన్సల్టెంట్లకు ఊరట కల్పించింది. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ (TDS) కింద దాఖలు చేయాల్సి ఉన్న పలు ప్రతిపాదనలకు సంబంధించిన డెడ్లైన్లను నెలరోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు వాటిని దాఖలు చేయడానికి వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే నోటీసులు అందుకున్న, ఆదాయపు పన్ను కమిషనర్ల వద్ద అప్పీల్ చేయదలిచిన, వివాదాలను పరిష్కరించడానికి ఏర్రపాటు చేసిన ప్యానెళ్ల వద్ద తమ క్లెయిమ్లను ఈ నెల 31వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చని సీబీడీటీ వెల్లడించింది. అలాగే ట్యాక్స్ రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేయడానికి, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రివైజ్డ్ రిటర్న్లను క్లెయిమ్ చేసే వారిని కూడా ఈ పొడిగింపు పరిధిలోకి తీసుకొచ్చింది.