Gold prices today: బంగారం ధరలు పెరిగి, తగ్గాయి
క్రితం సెషన్లో పెరిగిన బంగారం ధరలు నేడు (శుక్రవారం, మార్చి 11) కాస్త తగ్గాయి. పసిడి ధరలు రూ.53,000 దిగువకు వచ్చాయి. నేడు ప్రారంభ సెషన్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.310 తగ్గి రూ.52,929 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.249 క్షీణించి రూ.53,531 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.70,000కు పైనే ఉన్నాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.285 తగ్గి రూ.70,186 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.229 తగ్గి రూ.71,000 వద్ద ట్రేడ్ అయింది.
పసిడి ధరలు నిన్న ఉదయం తగ్గినట్లే తగ్గి ఆ తర్వాత మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం చల్లబడటం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో పసిడి ధరలు అంతకుముందు రెండు సెషన్లలో తగ్గడంతో పాటు, క్రితం సెషన్ ప్రారంభంలో రూ.52,500 స్థాయికి పడిపోయింది. అయితే నిన్న ఆ తర్వాత పసిడి ధర పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.405 పెరిగి రూ.53,150 వద్ద ముగిసింది. సిల్వర్ ధరలు కూడా నిన్న ప్రారంభంలో రూ.70,000 దిగువకు వచ్చి, ముగింపు సమయానికి రూ.815 పెరిగి రూ.70,390 వద్ద ముగిసింది.
గోల్డ్ ఫ్యూచర్ ధరలు క్రితం సెషన్లో 2000 డాలర్లకు పైన ముగిసింది. నేడు స్వల్పంగా తగ్గింది. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ 2000.40 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1993-2004 డాలర్ల మధ్య కదలాడింది. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 5 డాలర్లు నష్టపోయి 1995 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.148 డాలర్లు తగ్గి 26.108 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.