రెండు వారాల్లో రూ.2,000 తగ్గిన బంగారం ధర, మరింత పడిపోనుందా?
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోవారం క్షీణించాయి. కరోనా వ్యాక్సీన్ రాకపై ఆశలు, అమెరికా ఆర్థికప్యాకేజీ ప్రభావం, భారత్లో పసిడిపై ఒత్తిడిని తగ్గించాయి. శుక్రవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి 0.5 శాతం (రూ.268) పెరిగి రూ.50,260 వద్ద క్లోజ్ అయింది. చివరి సెషన్లో పెరిగినప్పటికీ, మొత్తంగా గత వారంలో ధరలు రూ.700 వరకు క్షీణించాయి. వెండి ధరలు కిలో రూ.1500 తగ్గింది. అంతకుముందు వారం రూ.1200 తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్, గతవారం రూ.700 క్షీణించింది. మొత్తంగా దాదాపు రూ.2వేలు తగ్గింది.

తగ్గిన ప్రీమియం
గతవారం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,260 వద్ద క్లోజ్ అయింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.50,268 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ కిలో రూ.62,260 వద్ద, మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.64,016 వద్ద క్లోజ్ అయింది.
ఇక, గోల్డ్ ప్రీమియం ధర 2 డాలర్లుగా ఉంది. గత వారం ప్రీమియం నాలుగు డాలర్లుగా ఉంది. దేశంలో బంగారం ధరలపై 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 8.25 (+0.44%) పెరిగి 1,869.75 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 25 శాతానికి పైగా పెరిగింది. 52 నెలల్లో 1458 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 2089 వద్ద గరిష్టాన్ని తాకింది.
వెండి ధర ఔన్స్ క్రితం సెషన్లో 0.179 (+0.74%) పెరిగి 24.227 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో వెండి 40 శాతం పెరిగింది. 52 వారాల్లో 11.680 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకిన వెండి, 29.915 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది.

మరింత కరెక్షన్
ఫైజర్, మోడర్నా వ్యాక్సీన్ ప్రకటనల నేపథ్యంలో బంగారం ధరలు దిద్దుబాటును చూస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చునని చెబుతున్నారు. అమెరికా డాలర్ బలపడి ధరల దిద్దుబాటుకు మరింత అవకాశముందని, అయితే దీర్ఘకాలంలో ఇది కొనుగోలుకు కూడా అవకాశంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications