కొత్త రికార్డ్స్, భారీగా పెరిగిన బంగారం ధర, రూ.వేలల్లో వెండి జంప్
బంగారం, వెండి ధరలు గురువారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకు ఎగిసిపడుతున్నాయి. నేడు (ఆగస్ట్ 6) ఎంసీఎక్స్లో 10 గ్రాముల గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ రూ.752 పెరిగి రూ.55,844 పలికింది. డిసెంబర్ డెలివరీ రూ.780 పెరిగి రూ.55,999 పలికింది. వెండి కిలో రూ.2,417 పెరిగి రూ.73,617 పలికింది. గోల్డ్ అక్టోబర్ బిజినెస్ టర్నోవర్ 16,548 లాట్లు, డిసెంబర్ డెలివరీ 1,196 లాట్లుగా ఉంది. బంగారం ధరలు వరుసగా ఏడో రోజు పెరిగాయి.
ముంబైలో పసిడి ధరలు
ముంబై రిటైల్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.51,217 (ప్లస్ జీఎస్టీ), 24 క్యారెట్ల పసిడి రూ.55,914 (ప్లస్ జీఎస్టీ), 18 క్యారెట్ల బంగారం రూ.41,936 (ప్లస్ జీఎస్టీ) పలికింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం రూ.57,600 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో (లండన్) స్పాట్ గోల్డ్ ఔన్స్ 2,061.76 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్స్ ధర 26 డాలర్లు పలికింది.
వరల్డ్ లార్జెస్ట్ గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద నిల్వలు బుధవారం నాటికి 0.8 శాతం పెరిగి 1,267.96 టన్నులకు చేరుకున్నాయి.
డాలర్ బలపడితే.. బంగారం ధరలో తగ్గుదల!
డాలర్ బలహీనపడటం, ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్ వార్ ఉద్రిక్తతలు, భౌగోళిక టెన్షన్స్, కరోనా కేసులు పెరగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొద్దిరోజుల్లోనే 56వేల దిశగా..
కరోనా మహమ్మారి అనంతరం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. గత పదిపదిహేను రోజుల్లో బంగారం ఏకంగా రూ.50వేల మార్క్ దాటి రూ.56 వేల సమీపానికి చేరుకుంది. వెండి ఈ మూడు రోజుల్లోనే రూ.11వేల వరకు పెరిగింది. ప్రతి రోజు కిలో వెండి ధర వేలల్లో పెరుగుతోంది.