రెండ్రోజుల్లో రూ.1500 వరకు తగ్గిన బంగారం ధరలు, నేడు మాత్రం జంప్
బంగారం ధరలు నిన్నటి వరకు వరుస సెషన్లలో తగ్గుముఖం పట్టాయి. అయితే నేడు (జూన్ 15, 2022) మాత్రం స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజుల్లో రూ.1500 వరకు తగ్గిన బంగారం ధరలు నేడు రూ.70 పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లోను పసిడి ధరలు 1815 డాలర్ల స్థాయికి దిగి వచ్చాయి. గత నెలలో 1810 డాలర్ల దిగువకు వచ్చి, అంతలోనే 1890 డాలర్ల దిశగా పరుగు పెట్టిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ ఈ స్థాయికి వచ్చాయి. ఇక వెండి ధరలు రూ.60,000 దిగువకు వచ్చాయి.
ఉదయం గం.10.45 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.69 లాభపడి రూ.50,264 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57 ఎగిసి రూ.50,516 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటి వరకు రెండు రోజుల్లో రూ.1500 వరకు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై నేడు రూ.364 పెరిగి రూ.59,865 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.373 పెరిగి రూ.60,579 వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.59,500 స్థాయికి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లోను పసిడి ధరలు భారీగానే తగ్గాయి. నేడు మాత్రం దాదాపు రెండు డాలర్ల మేర పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1.90 డాలర్లు పెరిగి 1815.40 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0159 డాలర్లు ఎగిసి 21.113 డాలర్ల వద్ద కదలాడింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్ 3.26 శాతం, సిల్వర్ ఫ్యూచర్ 25 శాతం మేర తగ్గింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు నేడు పెంపు నేపథ్యంలో పసిడి ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అమెరికాలో ద్రవ్యోల్భణం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు కీలకంగా మారింది. వడ్డీ రేటు ఎక్కువగా పెరగవచ్చుననే అంచనాలతో మార్కెట్ ఇన్వెస్టర్లు ఉన్నారు.