వారంలోనే రూ.1,800... తొలిసారి రూ.43,000కు చేరిన బంగారం ధర: హైదరాబాద్లో ఎంతంటే?
బంగారం ధరలు సోమవారం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఎంసీఎక్స్లోను బంగారం రికార్డ్ ధరకు చేరుకున్నాయి. అమెరికా - చైనా ట్రేడ్ వార్, సౌదీ అరబియాలో దాడులు, కరోనా వైరస్.. ఇలా వరుస ఉద్రిక్తతల మధ్య బంగారం ధర పెరుగుతూ, తరుగుతోంది. అయితే ఎంత పెరుగుతుందో అంత తగ్గడం లేదు. దీంతో క్రమంగా పసిడి ధర పైపైకి చేరుకుంటోంది.
ఇక, రియల్మి స్మార్ట్ టీవీ: రేపే మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్
తొలిసారి రూ.43,000 దాటిన గోల్డ్ ఫ్యూచర్స్
MCXలో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్స్10 గ్రాములకు ఉదయం గం.9.20 సమయానికి 0.87 శాతం లేదా రూ.370 పెరిగి రూ.43,036 వద్ద ఉంది. తొలిసారి రూ.43వేల మార్క్ దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్లో ఇది ఫ్రెష్ రికార్డ్. అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణం.
ఏడేళ్ల గరిష్టానికి..
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 2 శాతం మేర పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరుకుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ తదితర భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వంటి అతి విలువైన లోహాల వైపు చూస్తున్నారు. స్పాట్ గోల్డ్ 1.2 శాతం పెరిగి 1,662.37 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ఫిబ్రవరి 7, 2013లో బంగారం ధర 1,678.58 డాలర్లుగా ఉంది.
కరోనా వైరస్ ప్రభావం...
కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయంగా బంగారం ధరలపై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ వారం పసిడి ఏప్రిల్ కాంట్రాక్ట్ సానుకూలంగా ఉండవచ్చునని చెబుతున్నారు. రూ.41,963 కంటే కిందకు దిగి రానంత వరకు కాంట్రాక్ట్ రాణిస్తుందని చెబుతున్నారు. రూ.43,397 స్థాయికి వెళ్లాక లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశముందని, అఖ్కడ షార్ట్ సెల్లింగ్ వైపు మొగ్గు చూపవచ్చునని, ఈ నేపథ్యంలో రూ.41,963 వద్ద స్టాప్లాస్ పెట్టుకొని ప్రస్తుత లాంగ్ పొజిషన్లు కొనసాగించవచ్చునని చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర
24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.44వేల మార్క్ దాటింది. ఆదివారం విక్రయాల్లో గ్రాము రూ. 4,443 చొప్పున పలికింది. 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికింది. ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి గ్రాముకు రూ.4,073 ధర పలికింది.
వారంలో ఎంత పెరిగిందంటే..
గత వారం రోజుల్లో హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,790 పెరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన రూ.42,640గా పసిడి ధర 23వ తేదీ నాటికి రూ.44,430కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ. 1,580 వరకు పెరిగింది.
కరోనా వైరస్, రూపాయి ప్రభావం
కరోనా వైరస్ కారణంగా వాణిజ్య రంగంలో ఒడిదుడుకులను తట్టుకొనేందుకు పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం ధరల పెరుగుదలకు కారణం. రూపాయి ధర పతనమైన కొద్దీ బంగారం దిగుమతి ధర పెరుగుతుందని, దీంతో పసిడి ధరలు పెరుగుతాయి.