మోడీ సరికొత్త 'బంగారం' స్కీం: బయటపెట్టకుంటే అంతే... మినహాయింపులు, పన్నురేటు 30%!
న్యూఢిల్లీ: నల్లధనం నిర్మూలన కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో భారీ నిర్ణయంతో ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. బ్లాక్ మనీని టార్గెట్ చేసుకొని 2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వం, ఆ తర్వాత జీఎస్టీని ప్రవేశపెట్టింది. భావి భారత్ కోసం మరో సంచలన నిర్ణయంతో ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బంగారంపై అనూహ్య నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు. బంగారం విషయమై ఇదివరకు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ప్రచారం సాగుతోంది.
మోడీ మరో సంచలనం: బంగారంపై కేంద్రం కొత్త స్కీం, ఎక్కువ బంగారం ఉంటే జరిమానా?
క్షమాభిక్ష పథకం.. ఏమిటిది?
పరిమితికి మించి బంగారాన్ని దాచిన వారి కోసం ఓ క్షమాభిక్ష పథకం తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నోట్ల రద్దు అనంతరం చాలామంది తమ అక్రమ ఆర్జనను నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో భద్రపరుస్తున్నారు. దీనిని గ్రహించిన మోడీ ప్రభుత్వం నిర్ణీత పరిమితి దాటి నిల్వ చేసే బంగారాన్ని స్వచ్చంధంగా ప్రకటించాలని ఓ క్షమాభిక్ష పథకం తీసుకు రానుందట. పరిమితి దాటిన దానిని లెక్కల్లో చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
క్షమాభిక్ష.. పన్ను రేటు ఎలా ఉండొచ్చు...
నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి గద్దెనెక్కిన తర్వాత బ్లాక్ మనీ విషయమై 2014-16 మధ్య కాలంలో ఓ క్షమాభిక్ష పథకాన్ని తీసుకు వచ్చింది. అప్పుడు అమలు చేసిన పన్ను రేటు పరిమాణంలోనే బంగారానికి కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు. పన్ను రేటు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
నల్లధనాన్ని వెలికితీసేందుకు గతంలో స్వచ్చంధ వెల్లడి పథకం (VDS) తెచ్చారు. పన్ను దాదాపు 30 శాతం వరకు ఉండవచ్చునని అంచనా.
వచ్చే నెలలో బంగారంపై క్షమాభిక్ష పథకం!
బ్లాక్ మనీని బయటపెట్టాలని పలుమార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు పలుమార్లు సూచనలు చేసింది. ఆ తర్వాత నవంబర్ 8, 2016లో మోడీ హఠాత్తుగా నోట్ల రద్దుపై ప్రకటన చేశారు. సాధారణ ప్రజలు నోట్లు మార్చుకునేందుకు సమయం ఇచ్చారు. ఈ ప్రకటన వల్ల సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ మంచి కోసం చేసిన పనిగా ఎంతోమంది అభిప్రాయపడ్డారు. చేసిన పని మంచిది కాబట్టి కాస్త ఇబ్బంది భరిస్తామని ఎక్కువమంది చెప్పారు. బంగారంపై కూడా క్షమాభిక్ష పథకం వచ్చే నెల ఉండవచ్చునని తెలుస్తోంది.
త్వరలో... బంగారం పరిమితి నియమ నిబంధనలు!
బంగారంపై క్షమాభిక్ష పథకానికి సంబంధించి నియమ నిబంధనలను త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పసిడి నిల్వలకు పరిమితి తదితర అంశాలు అప్పుడే స్పష్టమవుతాయని అంటున్నారు.
ఈ స్కీంను ఉపయోగించుకోకుంటే...
కేంద్రం తీసుకువచ్చే ఈ స్కీంను తేలిగ్గా తీసుకోవద్దని, వినియోగించుకోకుండా ఉండవద్దనేది కొందరి సూచన. ఈ పథకాన్ని తేలిగ్గా తీసుకొని, వినియోగించుకోని పక్షంలో ఆ తర్వాత జరిగే ఆదాయపు పన్ను దాడుల్లో దొరికే పసిడిపై భారీ ఎత్తున జరిమానాలు ఉండవచ్చునని చెబుతున్నారు. లెక్కలు లేని బంగారంపై పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించవలసి ఉంటుందని చెబుతున్నారు.
వివాహమైన మహిళలకు మరింత మినహాయింపు..
వివాహమైన మహిళలకు కొంత మినహాయింపు లభించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పెళ్లైన మహిళలకు ఉన్న బంగారానికి ఇప్పటికే ఉన్న పరిమితికి మించి మరికొంత మినహాయింపు ఇవ్వవచ్చు. ముఖ్యంగా బంగారం అంశం సెంటిమెంట్తో కూడుకున్నది. దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా ఈ పథకాన్ని సిద్ధం చేసేందుకు ఆర్థిక, రెవెన్యూ శాఖలు ప్రయత్నిస్తున్నాయట. పరిమితులకు సంబంధించి ఇతర నిబంధనలు ఇంకా పూర్తిగా నిర్ణయించలేదట. ఈ నెల రెండో వారంలోనే క్షమాభిక్ష పథకంపై కేబినెట్లో చర్చ జరగాల్సిందని, కానీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని చెబుతున్నారు.
ఎందుకు.. ఏమిటి, ఎలా....
- దేశంలో నల్లధనం బంగారం రూపంలో చాలా ఎక్కువగా ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకే క్షమాభిక్ష పథకాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోందట.
- వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల వద్ద గరిష్టంగా ఎంత బంగారం ఉండొచ్చుననే పరిమితిని కేంద్రం ప్రకటిస్తుంది. అంతకుమించి ఉంటే లెక్కలు చూపాలి. లెక్కల్లో లేకుంటే పన్ను కట్టాలి. క్షమాభిక్ష పథకం తర్వాత కూడా ఆ బంగారాన్ని వైట్ చేసుకోకుంటే ఐటీ దాడుల్లో దొరికితే భారీగా జరిమానా ఉంటుంది.
- పథకాన్ని ప్రకటించిన తర్వాత పరిమితికి మించిన బంగారాన్ని బయటపెట్టి పన్ను కట్టాలి. ఆ తర్వాత దాడుల్లో, ఇతర సందర్భాల్లో బయట పడితే భారీ జరిమానా కట్టవలసి ఉంటుంది.
బంగారం బోర్డు
బంగారం విలువను ప్రభుత్వం గుర్తించిన నిపుణులు నిర్దారిస్తారు. ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు ప్రతినిధులతో కలిసి గోల్డ్ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరమే ఈ బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయట. కొనుగోలుదారులను ఆకర్షఇంచేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దేశంలో చట్టబద్దంగా పసిడి నిల్వలు పెంపొందించేందుకు కృషి చేస్తుంది.
దేవాలయాల్లోని బంగారాన్ని ఉత్పాదక పెట్టుబడిగా
దేవాలయాల్లోని బంగారాన్ని ఉత్పాదక పెట్టుబడిగా మలిచేందుకు మరో ప్రకటన ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేవాలయాలు, ట్రస్ట్ల వద్ద టన్నుల కొద్ది బంగారం నిల్వలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటి కోసం ప్రత్యేకంగా నియమనిబంధనలుంటాయని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లాకర్లలో ఈ బంగారం నిల్వలను భద్రపరచడం కోసం తగిన మార్గదర్శకాలను బంగారం బోర్డు జారీ చేయనుంది.
భారత్లో బంగారం లెక్కలు...
ప్రతి ఏడాది మన దేశం 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతుల విలువ రూ.2.5 లక్షల కోట్లు. భారత్లో గృహస్తుల వద్ద బంగారం 25 వేల టన్నుల పసిడి నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది 760 టన్నులకు డిమాండ్ ఉందని, ఆర్థిక మందగమనం కనిపిస్తున్నా ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం అక్టోబర్ 18వ తేదీ నాటికి ఆర్బీఐ వద్ద రూ.1,91,215 కోట్ల విలువైన బంగారం ఉంది. చాలా వరకు బంగారం సురక్షిత డిపాజిట్ల ఉంది. ఇది నిరుపయోగ ఆస్తిగా పేరుకుపోతోంది.