అంబానీని దాటివేసే వేగంతో అదానీ.. గంటకు రూ.75 కోట్ల సంపాదన
ముంబై: ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చెక్ చెప్పే దిశగా వెళ్తోంది. ఇటీవల అదానీ గ్రూప్ సంస్థల షేర్ భారీగా ఎగిసిపడుతోంది. గౌతమ్ అదానీ దూకుడు చూస్తుంటే అంబానీని దాటేసి కార్పోరేట్ రంగంలో అపరకుబేరుడిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదానీ సంపద ఇటీవల అనూహ్యంగా పెరిగింది. ఆయన కుటుంబ సంపద 67.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో ఇది రూ. 5 లక్షల కోట్లు. దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆస్తి 76.3 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.5.50 లక్షల కోట్లు. వీరి మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. గత ఏడాది ముఖేష్ అంబానీకి అదానీ దరిదాపుల్లో లేరు.
ఇప్పుడు కాకుంటే, ఇంకెప్పుడు: మనీ ప్రింటింగ్పై ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు
ప్రతి గంటకు రూ.75 కోట్లు
ఈ ఏడాది గౌతమ్ అదానీ సంపద ప్రతి గంటకు రూ.75 కోట్లు పెరిగింది. అదానీ గ్రూప్కు చెందిన 6 లిస్టెడ్ కంపెనీల్లో గతేడాది ఇదే సమయానికి రూ.10,000 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ.52,000 వేల రిటర్న్స్ అందిస్తోంది. ఈ ఒక్క ఏడాదిలో సంపాదన ఆయనను అంబానీ సరసన నిలిపింది. దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, అంబానీ, వాడియా కుటుంబాలతో పోటీ పడుతున్నారు.
తక్కువ కాలంలో జంప్
ఆదానీ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలు ఇన్ఫ్రాపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. ఆయన సంపద వేగంగా పెరగడానికి ఇది ప్రధాన కారణం. గత రెండేళ్ల నుండి ఈ కంపెనీలు వేగంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మొత్తం పెట్టిన రూ.50 వేల కోట్లలో కేవలం గత ఏడాదిలోనే రూ.25 వేల కోట్లను పెట్టుబడుల కింద పెట్టారు. అదానీ గ్రూప్ వరుసగా గ్యాస్ పంపిణీ, పవర్, ఓడరేవులు, విద్యుత్ పంపిణీ రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. వీటిల్లో చాలా రంగాల్లో పెట్టుబడుల విలువ తక్కువ కాలంలో భారీగా ఎగిసింది. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ గత ఏడాది రూ.1.64 లక్షల కోట్లు కాగా, 420 శాతం పెరిగి రూ.8.5 లక్షల కోట్లకు చేరుకుంది.
వ్యాల్యూ ఇలా పెరిగింది
ఆదానీ గ్రూప్కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో ఏడాదిగా అత్యల్పంగా విలువ పెరిగిన కంపెనీ అదానీ పోర్ట్స్. ఇది 144 శాతం పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్ వ్యాల్యూ అత్యధికంగా 1069 శాతం పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 842 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 715 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 442 శాతం, అదానీ పవర్ 176 శాతం మార్కెట్ వ్యాల్యూను పెంచుకున్నాయి. మొత్తానికి మొదటి ఆరు కంపెనీలు కలిపి 420 శాతం విలువ పెరిగాయి.