నవంబర్లో FPI రికార్డ్: అభివృద్ధి చెందిన దేశాల కంటే ఈ దేశాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి
నవంబర్ నెలలో ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్టర్స్(FPI)లు పెద్ద ఎత్తున వచ్చాయి. కరోనా తర్వాత ఇప్పుడు ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుంటోంది. వ్యాక్సీన్ పైన ప్రకటనల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఈ సమయంలో FPIలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. నవంబర్ నెలలో రూ.62,951 కోట్ల FPIలు వచ్చాయి. వరుసగా రెండో నెల కొనుగోళ్లు నమోదు చేశాయి.
తొలి అర్ధ సంవత్సరంలో FDIల జోరు, 6 నెలల్లో రూ.2.22 లక్షల కోట్లు
మొత్తం పెట్టుబడులు ఇలా
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారుల డేటా ప్రకారం ఈక్విటీ విభాగంలో నవంబర్ నెలలో అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. భారత మార్కెట్లోకి అక్టోబర్ నెలలో వచ్చిన FPIలు రూ.22,033 కోట్లు. నవంబర్ 3వ తేదీ నుండి 27వ తేదీ మధ్య వచ్చిన నికర FPIలు రూ.60,358 కోట్లు. డెట్ విభాగంలో రూ.2,593 కోట్లు వచ్చాయి. మొత్తం నికర పెట్టబడులు రూ.62,951 కోట్లు.
ఈ దేశాల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల ఆసక్తి
పెట్టుబడిదారులు అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారని గ్రో సీవోవో, కో-ఫౌండర్ హర్ష్ జైన్ అన్నారు. దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లోను ఈ ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రధానంగా బ్లూచిప్స్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
నవంబర్ నెలలో అందుకే
నవంబర్ నెలలో పెట్టుబడులు భారీగా పెరగడానికి ప్రధాన కారణాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులతో పాటు అమెరికా డాలర్ బలహీనత అని గుర్తు చేస్తున్నారు. అలాగే, దేశంలో కరోనా కేసులు తగ్గిపోవడం, రికవరీ వేగవంతంగా ఉండటం కలిసి వచ్చిందని చెబుతున్నారు. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 15శాతం పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి.