భారత టెలికాం సంస్థల పై విదేశీ కంపెనీల కన్ను.. ఎందుకో తెలుసా?
భారత టెలికాం రంగంలో ఎదో మాయ జరుగుతోంది. మన కంపెనీలపై విదేశీ సంస్థల కన్ను పడుతోంది. ఇప్పటికే ఈ దిశగా రిలయన్స్ జియో లోకి భారీ పెట్టుబడులు రాగా... మరో భారీ లావాదేవీకి రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈసారి దేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్టెల్ తో జట్టు కట్టేందుకు అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. అన్నీ కుదిరితే ఎయిర్టెల్ లో అమెజాన్ సుమారు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 15,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఎయిర్టెల్ లో సుమారు 5% వాటాను అమెజాన్ కు బదలాయించాల్సి వస్తుంది.
అయితే ఈ లావాదేవీ కేవలం ఓటీటీ సేవలకు సంబంధించి మాత్రమే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగానీ ఎయిర్టెల్ మాతృ సంస్థలో వాటా విక్రయం ఉండకపోవచ్చని ఎయిర్టెల్ ఒక ప్రకటన ద్వారా అర్థమవుతోంది. అంతర్గత వివరాలు ఎలా ఉన్నప్పటికీ భారత టెలికాం రంగం ఇటీవల మళ్ళీ పెట్టుబడుల కేంద్రంగా మారిపోతుండటం విశేషం. మారుతున్న వినియోగదారుల సరళని బట్టి కంపెనీలు ఎలా వివాహాలు మార్చుకుంటాయో ఇలాంటి లావాదేవీలు రుజువు చేస్తాయి.
కరోనా ఎఫెక్ట్.. ఈ ఏడాది కొత్త పథకాల్లేవ్, ఆ స్కీంలు కూడా ఆపేశాం: నిర్మలా సీతారామన్ ప్రకటన
జియో కు చెక్...
ఇటీవల భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ తన రిలయన్స్ జియో లో విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతున్నారు. కేవలం రెండు నెలల్లోనే దాదాపు 7 పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకున్నారు. అన్నీ కూడా రూ వేల కోట్ల పెట్టుబడులే కావటం విశేషం. ముఖ్యంగా ఫేస్బుక్ తో కుదిరిన రూ 11,000 కోట్ల ఒప్పందం ప్రత్యేకమని చెప్పాలి. తాజాగా సౌదీ అరేబియా కు చెందిన ముబాదాలా నుంచి రూ 9,000 కోట్లకు పైగా పెట్టుబడి సమకూరింది. ఇప్పటికే పెట్టుబడి పెట్టిన సిల్వర్ లేక్ మరింత పెట్టుబడి పెట్టడం విశేషం. దీంతో ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాలతో రిలయన్స్ జియో సుమారు రూ 90,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించించింది. ఇటీవలి కాలంలో ఇండియా లో జరిగిన అతిపెద్ద లావాదేవీల్లో ఇదే అత్యధికం కావటం విశేషం. అందుకే జియో కు చెక్ పెట్టాలంటే అదే స్థాయిలో పెద్ద కంపెనీలతో జట్టు కట్టాలని ఎయిర్టెల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే అమెజాన్ ను ఇందుకోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
పెరిగిన ఎయిర్టెల్ షేర్లు ...
అమెజాన్ వంటి బడా కంపెనీ ఎయిర్టెల్ లో ఇన్వెస్ట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు గణనీయంగా పెరిగాయి. బీఎస్ఈ లో శుక్రవారం ఎయిర్టెల్ షేర్లు 2.05% పెరిగి రూ 584.90 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతో ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ 3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అందుకే ఈ విలువ పరంగా చూస్తే ఎయిర్టెల్ లో సుమారు 5% వాటా కొనుగోలు చేయాలంటే అమెజాన్ దాదాపు రూ 15,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. విలువ పరంగా చూస్తే ఇదొక అతిపెద్ద డీల్ గా అవతరించనుంది. ఈ పెట్టుబడి సమకూరితే భారత టెలికం కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రతరం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదే ఆకర్షణ...
ప్రస్తుతం ఓటీటీ సేవలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత ప్రపంచ గమనమే పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనిపించటం లేదు. దీంతో అందరూ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కేవలం విడుదలైన సినిమాలను లేటుగా ప్రదర్శించే వేదిక గా ఇక ఎంత మాత్రం ఉండబోదు. ఇక్కడే కొత్త సినిమాలు విడుదలవుతాయి. సీరియళ్లు ప్రదర్శితం అవుతాయి. సిరీస్ లు నడుస్తాయి. కాబట్టి ఓటీటీ కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇదే అంశం విదేశీ సంస్థలను ఇండియా కు రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో అయినా.. ఎయిర్టెల్ లో అమెజాన్ వాటా కొనుగోలు అయినా ఇందుకోసమేనని చెబుతున్నారు. 36 కోట్ల మంది వినియోగదారులతో జియో ముందు వరుసలో ఉండగా.. సుమారు 30 కోట్ల మంది వినియోగదారులున్న ఎయిర్టెల్... అమెజాన్ సేవల విస్తరణకు బాగా పనికొస్తుందని భావిస్తున్నారు.