అరవింద్ యూత్ బ్రాండ్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడి.. ఎందుకో తెలుసా?
అరవింద్ ఫ్యాషన్స్... ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఇండియా లో దుస్తులకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్లలో అరవింద్ కూడా ఒకటి. ఇంత ప్రముఖమైన కంపెనీ నుంచి యువతకు సంబంధించిన ఫ్లైయింగ్ మెషిన్ అనే బ్రాండ్ ఒకటి బహుళ ప్రాచుర్యం పొందింది. కేవలం యువత కోసమే ఆ బ్రాండ్ దుస్తులను తయారు చేస్తుంది. దీనికి యువతలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ బ్రాండ్ పై ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కన్ను పడింది. వెంటనే అందులో పెట్టుబడి పెడతామని ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ను అరవింద్ ఫాషన్ కూడా కాదనలేదు. దీంతో ఈ రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదరటం, ఫ్లైయింగ్ మెషిన్ బ్రాండ్ లోకి పెట్టుబడులు రావటం చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో ఫ్లిప్ కార్ట్ పెట్టిన పెట్టుబడితో ఫ్లైయింగ్ మెషిన్ వాల్యుయేషన్ కూడా భారీగా పెరిగిపోవటం విశేషం. అరవింద్ లిమిటెడ్ అనేది స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీ. అందులో నుంచి డెనిమ్ విభాగాన్ని విభజించి అరవింద్ యూత్ బ్రాండ్స్ అనే సరికొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేశారు.
కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితుల్లో కీలక నిర్ణయం, వారి శాలరీ 3 రెట్లు పెంపు
రూ 260 కోట్లకు మైనారిటీ వాటా..
ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ పెట్టుబడికోసమే అరవింద్ నుంచి డెనిమ్ విభాగాన్ని విడదీసి... అరవింద్ యూత్ బ్రాండ్స్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేయగా... వాటా కొనుగోలు లావాదేవీ విజయవంతంగా పూర్తయింది. ఈ లావాదేవీ ప్రకారం అరవింద్ యూత్ బ్రాండ్స్ లో ఫ్లిప్ కార్ట్ రూ 260 కోట్ల పెట్టుబడిని పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా కంపెనీ లో మైనారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి కూడా ధృవీకరించటం విశేషం. కొన్ని తరాలుగా ఏర్పాటు చేసుకున్న ఘనమైన బ్రాండ్ విలువను, ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో ను పెంపొందించేలా అరవింద్ యూత్ బ్రాండ్స్ బృందంతో కలిసి పనిచేస్తామని అయన పేర్కొన్నారు.
అందుకే కొనుగోలు...
ఫ్లిప్ కార్ట్ కు ఆన్లైన్ ఫాషన్ విభాగంలో మెజారిటీ వాటా ఉంది. ఇప్పటికే మింత్రా, జబాంగ్ తో పాటు తన సొంత ఫ్లిప్ కార్ట్ ఫాషన్ ద్వారా ఇది నెంబర్ 1 స్థానంలో ఉంది. మొత్తం ఈ రంగంలో 60% వాటా ఫ్లిప్ కార్ట్ డే కావటం విశేషం. కాగా... ఇప్పుడు అరవింద్ లో వాటా కొనుగోలు చేయటం ద్వారా కంపెనీకి దేశవ్యాప్తంగా మరింత మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది. అంటే కాకుండా దేశవ్యాప్తంగా అరవింద్ కున్న విస్తృతమైన నెట్వర్క్ .. ఫ్లిప్కార్ట్ కు కలిసిరానుంది. ప్రస్తుతం అరవింద్ కు 1,290 స్టోర్లు, 10,000 కు పైగా మల్టీ బ్రాండ్ స్టోర్లు, 3,700 పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాలున్నాయి. ఇవన్నీ కూడా ఇకపై ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ స్టోర్ పరిధిలోకి రానున్నాయి. దాంతో వినియోగదారులకు ఆన్లైన్ లో అధిక చోయిసెస్ లభించటంతో పాటు, డెలివరీ వేగంగా జరుగుతుంది. అందుకే ఫ్లిప్ కార్ట్ పెట్టుబడి పెట్టినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
లాక్ డౌన్ దెబ్బ...
కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ కామర్స్ కంపెనీల సేవలపై కూడా నిషేధం కొనసాగింది. ఒక్క గ్రోసరీస్, అత్యవసర సరుకుల రవాణా తప్ప ఇతర ఏ ఈ కామర్స్ కంపెనీకి కూడా అనుమతి లేకపోవటంతో ఫ్లిప్ కార్ట్ బాగా దెబ్బతింది. లాక్ డౌన్ విధించిన రెండు నెలల కాలంలో ఫ్లిప్ కార్ట్ ఆదాయం 90% నికి పైగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆన్లైన్ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఫాషన్ కు ఉన్న ప్రాధాన్యత ను ఫ్లిప్ కార్ట్ గుర్తించి ఈ రంగంలో మరింత బలోపేతం కావాలని ఆశిస్తోంది. అదే సమయంలో షాపర్స్ స్టాప్ లో అమెజాన్ పెట్టుబడి పెట్టు దూసుకుపోతున్న తరుణంలో ఫ్లిప్ కార్ట్ కు కూడా అలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తోందని, ప్రస్తుతం అరవింద్ రూపంలో అది కలిసి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు కారణాలతో ఫ్లిప్ కార్ట్ .. అరవింద్ లో పెట్టుబడి కి ప్రాధాన్యత ఇచ్చిందని చెబుతున్నారు.