GDP: వృద్ధి రేటు 5 శాతమే, 11 ఏళ్ళ కనిష్టానికి అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో దేశ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టస్థాయి అయిన 5 శాతానికి చేరవచ్చునని జాతీయ గణాంక కార్యాలయం తన తొలి అడ్వాన్స్ ఎస్టిమేషన్లో వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008-09 సమయంలో జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది.
2018-19లో వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదైన ఈ ఏడాది పారిశ్రామికవృద్ధి కుంటుపడటంతో వృద్ధి డీలా పడింది. మంగళవారం వచ్చిన గణాంకాల ప్రకారం వాస్తవ స్థూల విలువ జోడింపులో వృద్ధి 4.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా. 2018-19లో ఇది 6.6 శాతంగా ఉంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్ మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు క్వార్టర్లలో జీడీపీ రేటు వరుసగా 5 శాతానికి, 4.5 శాతానికి తగ్గింది. దీంతో అడ్వాన్స్ ఎస్టిమేషన్ పైన అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేషన్కు మొదటి తొమ్మిది నెలల కాలంలోని అంటే ఏప్రిల్ - డిసెంబర్ మధ్య గణాంకాలను పరిగణలోకి తీసుకుంటారు.
భారత వృద్ధి రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా క్రమంగా తగ్గించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమంగా దిగజారింది. మొదటి ఆరు నెలల కాలానికి జీడీపీ 4.8 శాతం వద్ద నిలిచింది.
ఆర్థిక మందగమనాన్ని తగ్గించి, వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ను తగ్గించింది. బడ్జెట్ కూడా ఆ దిశగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీడీపీ అడ్వాన్స్ ఎస్టిమేషన్ వైపు అందరూ చూశారు.