ఇన్ఫోసిస్ చీఫ్ సలీల్ పరేఖ్కు బిగ్ షాక్: సమన్లు జారీ
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ అధినేత, ముఖ్య కార్యనిర్వహణాధికారి సలీల్ పరేఖ్కు షాక్ తగిలింది. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. నిర్మల సీతారామన్ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్ది సేపటి కిందటే ఆయనకు సమన్లను జారీ చేసింది. సోమవారమే తమ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే టాప్ కంపెనీగా పేరున్న ఇన్ఫోసిస్కు సారథ్యాన్ని వహిస్తోన్న సలీల్ పరేఖ్కు స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే సమన్లను జారీ చేయడం కార్పొరేట్ సెక్టార్లో కలకలం రేపింది.
ఎందుకు సమన్లను జారీ చేయాల్సి వచ్చింది?
దీనికి కారణాలు లేకపోలేదు. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ట్యాక్స్ పేయర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మధ్య కొత్తగా ఓ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇ-పోర్టల్ను అభివృద్ధి చేసింది ఇన్ఫోసిస్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన వ్యవస్థను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరింత సరళతరం చేసింది. ఇందులో భాగంగా ట్యాక్స్పేయర్స్ ఫ్రెండ్లీ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్కు రూపకల్పన చేసింది.
జూన్ 7 నుంచీ..
జూన్ 7వ తేదీన ఈ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ను వినియోగంలోకి తీసుకుని వచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీన్ని ప్రారంభించారు. కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు మరింత సరళతరంగా ఉంటుందని, కొత్తగా ఇందులో పొందుపరిచిన ఫీచర్లు మరింత ఫ్రెండ్లీగా ఉండబోతోన్నాయని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. పన్నుచెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను దాఖలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా దీన్ని రూపొందించినట్లు స్పష్టం చేసింది.
వేల కోట్ల రూపాయలు కలెక్షన్
పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ మొత్తాన్ని వెంటనే రీఫండ్ చేసేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. సింగిల్ డాష్బోర్డ్ మీదే అన్ని రకాల అప్లోడ్స్, పెండింగ్స్ తెలుసుకునే వీలు ఈ కొత్త పోర్టల్లో ఉంటుందని వివరించింది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్లను ఇందులో పొందుపరిచామని, దీనివల్ల ట్యాక్స్పేయర్లు త్వరితగతిన తమ అకౌంట్లను చెక్ చేసుకునే వీలును కల్పించిందీ పోర్టల్లో.
సాంకేతిక సమస్యలకు కారణం..
అక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఆ తరువాత అసలు సమస్యలు మొదలయ్యాయి. ఈ ఇ-పోర్టల్లో సాంకేతిక ఇబ్బందులు విపరీతంగా తలెత్తాయి. ఈ టెక్నికల్ గ్లిచ్చెస్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయంటే.. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు సకాలంలో తమ ఐటీ రిటర్నులను దాఖలు చేసినప్పటికీ.. వేల కోట్ల రూపాయల మొత్తాన్ని జరిమానాల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఇండివిడ్యువల్స్, కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లు.. ఇలా ఏ ఒక్క సెక్టార్ కూడా మినహాయింపు కాదు.
పెనాల్టీ మొత్తం రీఫండ్..
ఆ తరువాత అదంతా సాంకేతిక లోపాల వల్లే చోటు చేసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలస్యంగా గుర్తించింది. దేశవ్యాప్తంగా 22.75 లక్షల మంది ట్యాక్స్ పేయర్ల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఆదాయపు పన్నుల శాఖ తెలిపింది. దాన్ని వెంటనే కార్యాచరణలోకి పెట్టింది. 49,696 కోట్ల రూపాయలను రీఫండ్ చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుముల తిరిగి చెల్లించినట్లు పేర్కొంది.
కార్పొరేట్కూ వాత..
ఇందులో కార్పొరేట్ ట్యాక్సుల వాటా అధికం. 35,088 కోట్ల రూపాయల మొత్తాన్ని అధిక వడ్డీ, ఆలస్య రుసుముగా కార్పొరేట్ సంస్థల నుంచి వసూలు చేసింది. 1,24,732 కార్పొరేట్ కేసులు ఉన్నాయి. మిగిలిన 14,608 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇండివిడ్యువల్స్ నుంచి వసూలు చేసింది. ఇలాంటి కేసులు 21,50,668 ఉన్నాయి. మొత్తం 22.75 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది. దీనివల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కారణాలను వివరించాలంటూ..
దీనికంతటికీ కారణం ఇ-ఫైలింగ్ పోర్టల్ కావడం వల్లే.. దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సలీల్ పరేఖ్కు సమన్లను జారీ చేసింది. జూన్ 7వ తేదీన దీన్ని అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సాంకేతిక లోపాలను సరిదిద్దలేకపోయింది ఇన్ఫోసిస్. దీనికి గల కారణాలను సమగ్రంగా వివరించాల్సి ఉంటుందని సలీల్ పరేఖ్కు ఆదేశించింది. సోమవారమే తమ ఎదుట హాజరు కావాలని సూచించింది.