ప్రపంచంలోనే భారత్, చైనా అదుర్స్, మన పెట్టుబడులు మాత్రం డౌన్
కరోనా సంక్షోభ సమయంలో భారత్లోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వచ్చాయి. 2020 క్యాలెండర్ ఏడాదిలో ఇవి 13 శాతం ఎగిశాయి. మహమ్మారి సమయంలో దాదాపు అన్ని దేశాలకు FDIలు క్షీణించాయి. కానీ భారత్తో పాటు చైనాలోకి పెద్ద ఎత్తున వచ్చాయని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD) నివేదిక తెలిపింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి అత్యంత కనిష్టానికి చేరినట్లు పేర్కొంది. ముఖ్యంగా డిజిటల్, ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్, ఈ-కామర్స్, డేటా ప్రాసెసింగ్, డిజిటల్ పేమెంట్స్ రంగాల్లోకి వచ్చాయి.
పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
30 ఏళ్లలో ఇదే కనిష్టం
2020లో భారత్లోకి పెట్టుబడులు 13 శాతం పెరగగా, ఎం అండ్ ఏ పెట్టుబడులు 83 శాతం పెరిగాయి. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్తో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులతో పాటు ఇంధన రంగంలోని కొన్ని కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2019తో పోలిస్తే FDIలు 42 శాతం తగ్గాయి. 2019లో ఇవి 1.5 ట్రిలియన్ డాలర్లు కాగా, 2020లో 859 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. 1990 తర్వాత ఇదే కనిష్టం. 2008లో ఆర్థిక సంక్షోభంలో వచ్చిన FDI కంటే 30 శాతం తగ్గాయి.
చైనా టాప్
బ్రిటన్, ఇటలీ, రష్యా, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లోకి FDIలు 69 శాతం తగ్గాయి. కరోనా నుండి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నప్పటికీ 2021లో FDI వృద్ధి ఆశాజనకంగా కనిపించడం లేదంటున్నారు. FDIలలో చైనా అగ్రస్థానంలో ఉంది. 4 శాతం వృద్ధితో 163 బిలియన్ డాలర్లు వచ్చాయి. భారత్లోకి 13 శాతం పెరిగి 57 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
దేశీయ సంస్థల విదేశీ పెట్టుబడులు
ఇదిలా ఉండగా, దేశీయ సంస్థల విదేశీ పెట్టుబడులు డిసెంబర్ నెలలో తగ్గాయి. గత నెలలో 1.45 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం భారతీయ సంస్థలు విదేశాల్లోని తమ జాయింట్ వెంచర్స్ లేదా అనుబంధ సంస్థల్లో 2.51 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2020 డిసెంబర్ నెలలో 42 శాతం తగ్గి, 1.45 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. నవంబర్లో పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 27 శాతం తగ్గి 1.06 బిలియన్ డాలర్లగా నమోదయ్యాయి.