చైనా మోసాలకు అడ్డాగా తెలంగాణ..! దర్యాప్తులో షాకింగ్ విషయాలు.. డ్రాగన్ ఫేక్ గేమ్ పై భారత్ సీరియస్..
China Companies: భారత కంపెనీల మాటున చైనా చేస్తున్న కుట్రలు బయటపడ్డాయి. చైనాకు చెందిన పలు నకిలీ కంపెనీలు భారత్లో రిజిస్టర్ చేసి మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అలా వ్యాపారాలను నిర్వహించి టాక్సులు చెల్లించకుండా, యాప్స్ అధిక వడ్డీలకు లోన్స్ వంటి విషయాలపై చేస్తున్న దర్యాప్తులో తవ్వినకొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
నకిలీ కంపెనీలు ఎక్కడంటే..
చైనా కంపెనీలు ప్రధానంగా ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నకిలీ కంపెనీల కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కొద్ది రోజుల క్రితం విచారణ ప్రారంభించింది.
ఎక్కువ కంపెనీలు తెలంగాణలో..
హర్యానాలోని గుర్గావ్లోని జిలియన్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరులోని బెనింటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్లోని హుసిస్ కన్సల్టింగ్ లిమిటెడ్, తెలంగాణలోని 32 చైనా సంస్థలపై అధికారులు గత కొద్ది రోజులుగా దాడులు నిర్వహించారు.
అసలు సూత్రధారి అతడే..
ఈ దర్యాప్తులో మోసపూరితంగా సృష్టించిన చాలా కంపెనీలు నకిలీవని అధికారులు గుర్తించారు. అతి సాధారణ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులనే ఈ కంపెనీలకు డైరెక్టర్లుగా నియమించినట్లు బట్టబయలైంది. ఈ మోసానికి సూత్రధారి డార్ట్సే అనే వాస్తవం వెలుగులోకి వచ్చింది. అతను బీహార్కు పారిపోయాడని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చైనాకు పారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
డార్ట్సే అరెస్ట్..
నిందితుడు పారిపోవాలనుకుంటున్న వ్యవహారం తెలుసుకున్న అధికారులు శనివారం బీహార్ వెళ్లి అధికారులు డార్ట్సేను అదుపులోకి తీసుకున్నారు. జిలియన్ కన్సల్టెంట్స్కు చైనీస్కు చెందిన టార్ట్సే డైరెక్టర్గా ఉన్నట్లు కూడా వెల్లడైంది. అరెస్టయిన డార్ట్సే హిమాచల్ ప్రదేశ్లోని మండికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. స్కాంలో మరెన్నో మోసాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.