Russia: రష్యా పతనానికి EU మెగా ప్లాన్.. పుతిన్ తలవంచుతాడా..? ఇది భారత్ కు లాభమేనా..
Crude Oil: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సరఫరా విషయంలో యూరప్ దేశాలకు పుతిన్ చుక్కలు చూపిస్తున్నారు.
యూరోపియన్ యూనియన్..
ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న ఇప్పటికే పాశ్చాత్య దేశాల నుంచి అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో పుతిన్ ప్రభుత్వం ఆర్థికంగానూ కొంత ఇబ్బందులకు గురవుతోంది. అయితే ఈ వేడిని మరింతగా పెంచేందుకు ఈయూ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇకపై రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు ధరను ఒక్కో బ్యారెల్ కు కేవలం 60 డాలర్లుగా నిర్ణయించేందుకు సిద్ధమైంది.
గూడుపుఠాణీ..
ఎలాగైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను బలహీనపరచాలనే పనిలో ఈయూ నిమగ్నమైంది. అలా రష్యా నుంచి ప్రపంచ మార్కెట్లోకి వచ్చే చమురుకు ఇలా తక్కువ రేటు నిర్ణయించాలని గూడుపుఠాణీ చేస్తోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర దాదాపు 87 డాలర్ల వద్ద ఉంది. ఇలా ఆదాయానికి గండి కొట్టడం ద్వారా నిధుల లభ్యతను తగ్గించి, పుతిన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది.
దౌత్యపరంగా..
పుతిన్ పతనమే లక్ష్యంగా పెట్టుకున్న యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలు సైతం ఈ ప్రతిపాదనను ధృవీకరించారు. తక్కువ చమురు ధరను నిర్ణయించడానికి సోమవారాన్ని డెడ్లైన్గా నిర్ణయించారు. క్రూడ్ ధరలను నియంత్రించటం యుద్ధాన్ని త్వరగా ముగించడంతో సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ధరల పరిమితిని నిర్ణయించకపోతే రష్యాకు లాభదాయకంగా ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ధరల పరిమితి నిర్ణయిస్తే మిత్రదేశమైన భారత్ కు సరసమైన ధరలకే చమురు సరఫరా చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలా జరిగితే దేశంలోని ప్రజలపై ధరల భారం పెరగదు.
పరిమితులు ఉన్నప్పటికీ..
పాశ్చాత్య దేశాలు రష్యా ఎగుమతులపై పరిమితులు సహా అనేక ఇతర పరిమితులు పెట్టినప్పటికీ.. చమురు అమ్మకాల సొమ్ము దాని ఆర్థికాన్ని బలంగా ఉండేందుకు దోహదపడుతోంది. ప్రస్తుతం రష్యా రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఈ ఆంక్షలు అమలులోకి వస్తే రష్యా తన చమురు ఎగుమతులు నిలిపివేసే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ధర పరిమితిని నిర్ణయిస్తే చమురును విక్రయించనని పుతిన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇది ద్రవ్యోల్బణ సమయంలో సామాన్యుల జేబులకు మరింత చిల్లును పెడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.