EPFO interest rate: ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేటుకు మార్కెట్ల షాక్!
కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎన్నో కంపెనీల లాభాలు భారీగా తగ్గిపోయాయి. ఐటీ కంపెనీల ఆదాయంపై ప్రభావం పడటంతో ఉద్యోగుల వేతన పెంపు, బోనస్లపై ప్రభావం పడుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు. కరోనా దెబ్బ పీఎఫ్ సబ్స్క్రైబర్ల పైన కూడా పడే అవకాశముంది.
బంగారంపై పెట్టుబడి ఇప్పటికీ మంచిదేనా, ధర ఎందుకు తగ్గుతోంది?
8.50 శాతం వడ్డీ అందించకపోవచ్చు
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ రేటును అందించనున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తెలిపింది. అయితే మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో 60 మిలియన్ల మంది పీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఈ వడ్డీని అప్పుడే అందించే అవకాశాలను దెబ్బతీయవచ్చునని అంటున్నారు.
నిధులు వెనక్కి తీసుకోలేదు..
మార్చి 11న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. అంతకుముందే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లలోని ఈపీఎఫ్కు చెందిన రూ.95,500 కోట్ల నిధులను వెనక్కి తీసుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్లు ఏ రోజుకు ఆ రోజు రికార్డు నష్టాలను చవిచూస్తున్నాయి.
8.15 శాతానికి ఇబ్బంది లేదు..
2015లో ఈపీఎఫ్ఓ మొదటిసారి ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టింది. నాడు 5 శాతం పెట్టుబడులతో ప్రారంభించింది. మే 2015 నాటికి ఇది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మార్కెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేటును అప్పుడే సబ్స్క్రైబర్లకు అందించే అంశం ఆలస్యం కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు ఈపీఎఫ్ఓ వద్ద ఫండ్స్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ ఉన్నాయి. కానీ మిగతా 0.35 శాతం మాత్రం ఈటీఎఫ్స్ నుండి అందిస్తాయి. ఇప్పుడు ఇవి నష్టాల్లో ఉన్నాయి.