EPFO కీలక నిర్ణయం, మార్చి 4న సమావేశం, తగ్గనున్న PF వడ్డీ రేటు?
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ వడ్డీ రేటును మార్చి 4వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. శ్రీనగర్లో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీలు భేటీ కానున్నారు. ఆ తర్వాత వడ్డీ రేటును ప్రకటించవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ట్రస్టీ ఈ రఘునాథన్ పీటీఐతో మాట్లాడుతూ.. తదుపరి సీబీటీ సమావేశం మార్చి 4న ఉన్నట్లు సమాచారం వచ్చిందని, శ్రీనగర్లో ఈ సమావేశం ఉంటుందని, అజెండా పేపర్స్ త్వరలో పంపిస్తారన్నారు. వడ్డీ రేటుకు సంబంధించి డిస్కషన్ ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి సమాచారం రాలేదని తెలిపారు.
అయితే ఈ భేటీలో పీఎఫ్ వడ్డీరేటు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను పీఎఫ్ వడ్డీరేటును నిర్ణయించడానికి ఈపీఎఫ్ఓ కేంద్ర బోర్డు ట్రస్టీల సమావేశంలో వడ్డీరేటు కోత పెట్టే వీలుందని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో జరిగిన సమావేశంలో వడ్డీరేటును 0.15 శాతం మేర తగ్గించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను పీఎఫ్ వడ్డీరేటు ఏడేళ్ల కనిష్ఠాన్ని తాకి 8.5 శాతంగా ఉంది. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉంది. ఇప్పుడు మరోసారి కోతకు ఆస్కారం ఉందని తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో చాలామంది విరాళాలు తగ్గిపోయాయి. పీఎఫ్ సొమ్ము ఉపసంహరణలు పెరిగాయి. ఈ క్రమంలో వడ్డీరేట్ల కోతకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. 'మార్చి 4న శ్రీనగర్లో కేంద్ర బోర్డు ట్రస్టీల సమావేశం జరగనుంది. త్వరలోనే ఎజెండా ప్రకటిస్తామ'ని ఈపీఎఫ్ఓ ట్రస్టీ కేఈ రఘునాథన్ తెలిపారు. వడ్డీ రేటును ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం ముగింపులోనే వడ్డీ రేటు సవరణ ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల తర్వాత ట్రస్టీల సమావేశం అవుతుంది. దీంతో వడ్డీరేట్లపై ఓ నిర్ణయం తప్పక ఉండే అవకాశాలున్నాయి.