తెలంగాణ ఆదర్శం: 'రైతుల చేతికి డబ్బులు అందితేనే .. ఎకానమీ పట్టాలు ఎక్కుతుంది'
భారత ఆర్థిక వ్యవస్థ గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హడావిడి నిర్ణయాలు, మూలాలను కదిలించే చర్యలతో ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 11 ఏళ్ళ కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు డిమాండ్ లేక ఈగలు తోలుకుంటున్నాయి. ప్రభుత్వ పన్ను వసూళ్లు అంతకంతకూ పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 1 న ఆమె బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారా.. వాటి వల్ల దేశం, ఆర్థిక రంగం మళ్ళీ పునరుజ్జీవం పొందుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
2014 తర్వాత మరోసారి మోడీ ప్రభుత్వం 'ఖర్చు నియంత్రణ' నిర్ణయం
బడ్జెట్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. కానీ ఏం చేస్తే మన ఆర్థిక వ్యవస్థ వెంటనే పుంజుకుంటుంది అనే అంశాల్లో మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఆదయ పన్ను తగ్గించాలని, మరికొందరు జీఎస్టీ తగ్గించాలని, ఇంకొందరు కార్పొరేట్ పన్ను కుదించాలని కోరుతున్నారు. అయితే, కొందరు ఆర్థిక వేత్తలు మాత్రం రైతులకు డబ్బులు చేరేలా నిర్ణయాలు ఉండాలని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఉంటేనే ఎకానమీ పట్టాలు ఎక్కుతుందని చెబుతున్నారు.
70% రైతులే...
130 కోట్ల భారతావని లో ఇంకా 70 కోట్ల మందికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నిమగ్నమైన రైతులే ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో వారి వాటా 60% అన్న మాట. ఇటీవలి కాలంలో రైతుల ఆదాయం పెరిగేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనీ మోడీ అనేక సార్లు ప్రసంగాలు చేసారు. అంతవరకే పరిమితమైంది. ఏవో కొన్ని కంటి తుడుపు చర్యలే గానీ నేరుగా వారికి లబ్ది చేకూర్చే నిర్ణయాలు లేవు. అందుకే, 70 కోట్ల జనాభా చేతికి ప్రత్యక్షంగా నగదు అందేలా ప్రణాళికలు, పథకాలు ప్రవేశ పెట్టాలని దాంతో దేశంలో వినియోగం పెరుగుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించవని చెబుతున్నారు. కీలెరిగి వాత పెట్టాలంటారు పెద్దలు. అంటే సమస్య మూలం తెలుసుకుని పరిష్కారం వెతకాలన్నమాట. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగ వ్యవహరిస్తోందని, దాని ఫలితమే ఆర్థిక మందగమనం అని వారు కుండా బద్దలు కొడుతున్నారు.
తెలంగాణ ఆదర్శం..
దేశం మొత్తంమీద ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు ఎకరాకు రూ 10 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇది వారిని ఆర్థికంగా పరిపుష్టం చేస్తోంది. రుణాల ఊబిలో నుంచి వారిని బయట పడేయటమే కాకుండా, సమయానికి పెట్టుబడి సాయం అందటంతో పంటల దిగుబడి పెరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూడా ఇదే విషయం స్పష్టమైంది. దేశంలోనే తెలంగాణ ఆర్థిక వృద్ధి లో నెంబర్ 1 గా నిలిచింది. దీనికి అసలు కారణం రైతులకు నేరుగా నగదు ప్రోత్సాహం అండటమేనని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు దేశానికి కూడా ఇలాంటి తక్షణ, సమర్థమైన పరిష్కారాల అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. తెలంగాణ ను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కో రైతుకు రూ 6,000 ఆర్థిక సాయం చేస్తున్నా... అది ఆశించిన స్థాయిలో ఫలితాయి ఇవ్వలేదు. ఎందుకంటే రూ 2,000 చొప్పున మూడు విడతల్లో ఇవ్వటంతో ఆ మొత్తంతో ఎలాంటి ఉపయోగకరమైన పనిని రైతులు చేయలేకపోయారని తేలింది. అదే తెలంగాణలో సగటున ఒక్కో రైతుకు రూ 25,000 అందటం తో దానిని వారు అనేక రకాల ప్రయోజనకర అంశాలపై పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.
నిర్మాణం కీలకం..
వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేది నిర్మాణ రంగం. ఈ రంగానికి కూడా ప్రభుత్వం నేరుగా ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భవన నిర్మాణం, రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల రంగంపై పెట్టుబడులు కుమ్మరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ రంగంపై సుమారు రూ 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... అమల్లో మాత్రం ఆ దిశగా పెద్దగా చర్యలు కనిపించటం లేదు. అందుకే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్నీ గుర్తించి బడ్జెట్ లో సరైన ప్రతిపాదనలు చేయాలనీ ఆర్థికవేత్తలు కోరుతున్నారు.
వారు కదలాలి...
ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా... వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సింది కార్పొరేట్ కంపెనీలే. ఎన్నో ఏళ్లుగా కార్పొరేట్ టాక్స్ తగ్గించాలని కోరిన పారిశ్రామిక సంస్థలు... తీరా పన్ను తగ్గించిన తర్వాత మాత్రం పెట్టుబడులు పెట్టటం లేదు. అందుకే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ముకేశ్ అంబానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ వంటి దిగ్గజాలు మోడీ తో భేటీ అయినవారిలో ఉన్నారు. వారి ఉమ్మడి టర్నోవర్ మన దేశ జీడీపీ లో సుమారు 10% నికి సమానం. అందుకే వారు ఏదైనా సరిగ్గా అమలు చేస్తే మిగితా కంపెనీలు అనుసరిస్తాయి. వారు పెట్టుబడులు పెట్టటం ప్రారంభిస్తే మిగతా వారు కూడా కదులుతారు. బహుశా మోడీ ఈ విషయాన్నీ గుర్తించినట్లున్నారు. లేదంటే పురోగతి సాధ్యం కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు.