విదేశీ పెట్టుబడుదారులు వెనక్కి వెళ్లినా, దేశీయ ఇన్వెస్టర్ల దూకుడు
ఓ వైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకుంటుంటే, మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) పెరగడంతో పాటు వారు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు పదహారు నుండి సంవత్సరంన్నరగా దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి నగదును జొప్పిస్తున్నారు. కేవలం 2022 క్యాలెండర్ ఏడాదిలోనే ఇప్పటి వరకు DIIల పెట్టుబడుల వ్యాల్యూ రూ.2 లక్షల కోట్లు క్రాస్ చేసింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో డీఐఐలు రావడం ఇదే మొదటిసారి.
పెరుగుతున్న ద్రవ్యోల్భణం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతల కారణంగా జరిగిన మార్కెట్ కరెక్షన్ను ఇన్వెస్టర్లు సద్వినియోగం చేసుకున్నారని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) నికర అమ్మకందారులుగా ఉన్నప్పటికీ, DIIలు వరుసగా పదహారు నెలలుగా నికర కొనుగోలుదారులుగా ఉన్నారని చెబుతున్నారు. అంటే వారు విక్రయించిన దాని కంటే ఈక్విటీ కొనుగోలు ఎక్కువగా ఉంది.
చాలామంది ఫిజికల్ అసెట్స్ నుండి మరలుతున్నారని, వాటిని ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల సంఖ్య చాలా రెట్లు పెరిగిందని గుర్తు చేస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేటు ఎప్పుడూ కొంత వరకు ఈక్విటీ పెట్టుబడికి అడ్డంకిగా మారుతుందని చెబుతున్నారు.