డిజిటల్ గోల్డ్కు ట్రస్టీగా డిబెంచర్ ట్రస్టీలు వ్యవహరించవద్దు
డిజిటల్ గోల్డ్ వంటి నియంత్రణరహిత ఉత్పత్తులకు ట్రస్టీగా వ్యవహరించేందుకు డిబెంచర్ ట్రస్టీలకు అనుమతిలేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఇంతకుముందు డిజిటల్ గోల్డ్ నిర్వహణ నుండి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, స్టాక్ బ్రోకర్లను సెబీ తప్పించింది.
డిజిటల్ గోల్డ్కు ట్రస్టీలుగా కొన్ని లిస్టెడ్ డిబెంచర్ ట్రస్టీలు వ్యవహరిస్తున్నారని సెబీ దృష్టికి రావడంతో తాజా ఆదేశాలను జారీ చేసింది. డిబెంచర్ ట్రస్టీల నిబంధనల ప్రకారం ఇలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని సెబీ వివరించింది.
దీపావళి, ధన్తెరాస్(ధనత్రయోదశి) పర్వదినాల్లో బంగారం కొనడం భారతీయులకు ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఏటా ఈ సీజన్లో బంగారం కోనుగోళ్లు రికార్డుస్థాయిలో ఉంటాయి. అయితే ఈసారి కరోనా మహమ్మారి దృష్ట్యా చాలామంది జ్యువెల్లరీ దుకాణాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఫలితంగా డిజిటల్ బంగారాన్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ డిజిటల్ గోల్డ్ను ప్రభుత్వ గుర్తింపు పొందిన మూడు ప్రయివేటు లిమిటెడ్ సంస్థలు అందిస్తున్నాయి. పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధర, సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో డిజిటల్ గోల్డ్కు ఆదరణ పెరుగుతోంది.