హాల్మార్క్.. 2021 జూన్ 1 వరకు పొడిగింపు: ఆ బంగారు ఆభరణాల విక్రయాలకే అనుమతి
బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి అనే నిబంధన గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గడువును 2021 జూన్ 1వ తేదీకి పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే నిబంధనను మరికొద్ది నెలలు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం తెలిపారు. వ్యాపారుల అభ్యర్థన మేరకు జనవరి 15, 2021కి బదులు జూన్ 1 నుండి అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
అమ్మో.. బంగారం: రూ.1,000 పెరిగిన పసిడి, రూ.3,500 పెరిగిన వెండి, దిద్దుబాటు ఉంటుందా?
స్వచ్ఛతకు హాల్ మార్కింగ్
ఆభరణంలోని బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణ హాల్ మార్కింగ్. తొలుత దీనిని 2021 జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. అప్పటిలోగా జ్యువెల్లర్స్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (BIS) వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి 14, 18, 22 క్యారెట్ల ఆభరణాల విక్రయానికే అనుమతిస్తామని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం హాల్ మార్కింగ్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏడాది క్రితమే కేంద్రం ఆదేశించింది.
ఆందోళన అందుకే.. పొడిగింపు
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (AGJDC), ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ హాల్ మార్కింగ్ పొడిగింపు కోసం కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా జ్యువెల్లరీ షాప్ యజమానులు మూడు నెలలు భారీగా నష్టపోయారని, ఇది కోలుకోవడానికి మరో మూడు నుండి నాలుగు నెలలు పట్టే అవకాశముందని, కాబట్టి హాల్ మార్కింగ్ లేని జ్యువెల్లరీ మిగిలిపోయే అవకాశం ఉందని AGJDC వైస్ చైర్మన్ శంకర్ సేన్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.
40 శాతం ఆభరణాలు హాల్ మార్కింగ్
BIS 2000 సంవత్సరం నుండి బంగారు ఆభరణాల కోసం హాల్ మార్కింగ్ స్కీంను రన్ చేస్తోంది. ప్రస్తుతం 40 శాతం బంగారు ఆభరణాలు హాల్ మార్క్ చేస్తున్నారు. బిస్లో 28,849 మంది జ్యువెల్లర్స్ రిజిస్టర్ అయ్యారు. హాల్ మార్క్ బంగారం స్వచ్ఛతకు ధ్రవీకరణ. ఇది కొనుగోలుదారులకు ప్రయోజనం. వారు మోసపోకుండా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారత్ అత్యధిక బంగారం వినియోగించే దేశం. ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఏడాదికి 700 టన్నుల నుండి 800 టన్నులు దిగుమతి చేసుకుంటుంది.