యూపీఐ ద్వారా నిలిచిన డిపాజిట్లు, క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనల పేరుతో యూపీఐ ద్వారా నిధుల బదలీని క్రిప్టో ఎక్స్చేంజీలు అంగీకరించకపోవడం ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టో కాయిన్స్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు క్రిప్టో ఎక్స్చేంజీల్లో ఉన్న తమ ఖాతాలకు నగదు బదలీ చేయాలి. ఇటీవలి కాలంలో ఎక్కువమంది మొబైల్ నుండే యూపీఐ పద్ధతిలో నగదు బదలీ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులను కాయిన్స్విచ్ కుబేర్, వజీర్ఎక్స్ తదితర ఎక్స్చేంజీలు అంగీకరించడం లేదు.
దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. క్రిప్టో ఎక్స్చేంజీలు యూపీఐ సదుపాయాన్ని వినియోగిస్తున్నట్లు తమకు తెలియదని ఎన్పీసీఐ గత వారంలో చేసిన ప్రకటనతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారుయ కాయిన్ స్విచ్ యాప్ బుధవారం నుండి యూపీఐ చెల్లింపులను ఆమోదించడం లేదని ఇన్వెస్టర్లు వెల్లడించారు. వజీర్ ఎక్స్ కూడా ట్విట్టర్లో యూపీఐ ద్వారా చెల్లింపుల సదుపాయం లేదని ఇన్వెస్టర్లకు సూచించింది.
ఎన్పీసీఐ ప్రకటనతో తలెత్తిన గందరగోళమే ఇందుకు కారణమని క్రిప్టో ట్రాన్సాక్షన్స్లో అనుభవం కలిగినవారు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఎన్పీసీఐ కానీ క్రిప్టో ఎక్స్చేంజీలు కానీ ప్రకటన చేయలేదు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ను నిషేధించాలనే ఆలోచన ఎంతో కాలంగా మనదేశంలో ఉందని, కానీ ఈ విషయాన్ని తేల్చకుడానే గత బడ్జెట్లో కేంద్రం క్రిప్టో ట్రాన్సాక్షన్స్ను పన్ను పరిధిలోకి తీసుకు వచ్చింది. ఈ నెల 1వ తేదీ నుండి క్రిప్టో ట్రేడింగ్ పైన ఆర్జించే లాభాలకు పన్నును విధిస్తున్నారు. దీంతో పరోక్షంగా ఈ ట్రాన్సాక్షన్స్కు ఆమోదముద్ర వేసినట్లయింది.