పెరుగుతున్న క్రూడ్ ధరలు, ద్రవ్యోల్భణంపై తీవ్ర ప్రభావం
ముడి చమురు ధరల నిరంతర పెరుగుదల ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కొనసాగుతున్న అధిక చమురు ధరలు ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు చమురు ధరలు 70 డాలర్లకు కాస్త పైన ఉన్నాయి. అయితే ఈ యుద్ధం తర్వాత చమురు ధరలు ఓ సమయంలో 140 డాలర్లు దాటింది. చాలాకాలంగా క్రూడ్ ధరలు 110 డాలర్ల వద్ద ఉన్నాయి. ప్రస్తుతం 100 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది దిగుమతులపై, రవాణాపై పడి, ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశముంది. తదనుగుణంగా అంచనాలకు మించి ద్రవ్యోల్భణం పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర బ్యాంకు అంచనా వేస్తోంది. ఇది ఆర్బీఐ వడ్డీ రేటు మార్పుపై ప్రభావం చూపుతుంది.
క్రూడ్ ధరలు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. 105 నుండి 120 డాలర్ల మధ్య మరికొంత కాలం ఉంటే కనుక ఈ ప్రభావం ద్రవ్యోల్భణంపై మరింతగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అప్రమత్తమై రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. ఎనర్జీ అవసరాల కోసం భారత్ అత్యధికంగా బొగ్గు దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల, బొగ్గు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో పవర్ కంపెనీలు కూడా టారిఫ్స్ పెంచే పరిస్థితులు వచ్చాయని అంటున్నారు.
అంతర్జాతీయంగా ఏడాది ప్రాతిపదికన బొగ్గు ధరలు 196 శాతం పెరిగాయి. అప్పుడు కంపెనీలపై ప్రభావం పడి, ఎనర్జీ ధర పెరుగుదల ప్రభావం ఉత్పత్తులపై పడుతుంది. కంపెనీలు ధరలు పెంచకుంటే అవి నష్టాల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఆర్బీఐ కూడా వడ్డీ రేటు పెంపు వైపు ఆలోచన చేస్తోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం రుణాలు పెరుగుతున్నాయి.