కరోనా దెబ్బతో రూ.3.35 లక్షల కోట్ల నష్టం: ఈ ఒక్క షేర్ ఆల్టైం గరిష్టానికి, ఎఫ్ఎంసీజీ దూకుడు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 30) భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో షేర్ల అమ్మకాలు చోటు చేసుకున్నాయి. అలాగే, భారత వృద్ధి రేటును పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించాయి. ఈ ప్రభావం కూడా చూపింది. డాలరుతో రూపాయి మారకం 70 పైసలు తగ్గి 75.59 వద్ద క్లోజ్ అయింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం కూడా ఆందోళన కలిగించింది.
బిజినెస్పై కరోనా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, మేం ఏం చేశామంటే: HCL
ఈ షేర్ ఆల్ టైమ్ గరిష్టానికి..
సెన్సెక్స్ 1,375 పాయింట్లు తగ్గి 28,440 వద్ద, నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281 వద్ద క్లోజ్ అయింది. 5 నిమిషాల్లో కరోనా పరీక్ష నిర్వహించే కిట్కు మాతృసంస్థ అబాట్ అనుమతి పొందిందనే వార్తల నేపథ్యంలో అబాట్ ఇండియా షేర్ 8.97 శాతం లాభంతో రూ.15,400 వద్ద క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హైకి చేరుకుంది. సెన్సెక్స్ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ షేర్ అధికంగా 12 శాతం నష్టపోయింది.
రూ.3.35 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజు రూ.3.35 లక్షల కోట్లు ఆవిరైంది. BSE నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,35,192.89 కోట్లు తగ్గి రూ.1,09,63,832.17 కోట్లకు పడిపోయింది. మొత్తం 1,392 షేర్లు నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలూ 2.13 శాతం మేర క్షీణించాయి.
హెల్త్కేర్, ఎఫ్ఎంసీజీ మాత్రమే లాభాల్లో..
బీఎస్ఈలో 1,392 కంపెనీలు నష్టపోయాయి. 881 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 180 షేర్లలో మార్పు లేదు. బీఎస్ఈ రియాల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో షేర్లు 7 శాతం వరకు నష్టపోయాయి. కేవలం హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ మాత్రమే లాభపడ్డాయి. బజాజ్ 12 శాతం మేర నష్టపోగా, ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి.