దేశంలో మళ్ళీ కరోనా పంజా .. మదుపరుల భయం , మార్కెట్ పతనానికి కారణం
మొన్నటి వరకు ఉత్సాహంగా పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాల్లోకి జారిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి పెరుగుతున్న కరోనా మహమ్మారి కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అన్న కారణాలతో మార్కెట్లో మళ్లీ ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి. కరోనామహమ్మారి విజృంభిస్తున్న అంచనాల మధ్య కీలక సూచీలు కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాలలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది . ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా కనిపిస్తుంది.
రిటైర్మెంట్ హోమ్స్.. వృద్ధుల డ్రీమ్ హోమ్స్ .. పెద్దల కోసం ప్రత్యేక వసతులతో
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్ర , కేరళ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి మళ్లీ ఈ దేశంలో ప్రధానంగా ఐదు రాష్ట్రాలలో విస్తరిస్తోంది. ఈ పరిణామాలు మళ్లీ లాక్ డౌన్ ప్రకటించే దిశకు వెళతాయా అన్న ఆందోళన ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొనుగోళ్లకు బదులు అమ్మకాలు పెరిగాయి . బేర్ గుప్పెట్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు చేరుకున్నాయి. బడ్జెట్ తర్వాత కొనసాగిన ర్యాలీ నేపద్యంలో వచ్చిన లాభాలన్నీ తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
దేశంలో పెరుగుతున్న కరోనా భయాలు, మహారాష్ట్రలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలు, పలుచోట్ల ఇప్పటికే విధించిన రాత్రి కర్ఫ్యూలు , కరోనాపై ఒక్కసారిగా ఆందోళనలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మార్కెట్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అనుమానంతో మదుపరులు కొనుగోళ్లపై కాకుండా అమ్మకాల పై దృష్టి సారించారు. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా బేర్ మంటున్నాయి. నష్టాలను చవిచూస్తున్నాయి.