మరో లేమన్... చైనా ఎవర్గ్రాండ్! ప్రపంచం ముందు మరో ఆర్థికసంక్షోభం!?
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చడానికి చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ తర్వాత ఇది అతిపెద్ద సంక్షోభంగా మారనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు చెందిన ప్రముఖ రియాల్టీ సంస్థ ఎవర్గ్రాండ్ దివాలా దిశగా ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల (రూ.22 లక్షల కోట్లకు పైగా) మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. 2008లో ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ అందరి కళ్లముందు మెదులుతోంది. ఇప్పుడు మరోసారి ఎవర్ గ్రాండ్ కారణంగా మరోసారి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. ఇటీవలి వరకు మంచి పరపతి రేటింగ్ ఉన్న ఈ కంపెనీ రుణ పత్రాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఇన్వెస్ట్ చేసినవారిలో కొంతమంది కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద ఆత్మహత్యలకు కూడా సిద్ధం కావడం గమనార్హం.
ఎవర్ గ్రాండ్ ప్రస్థానం, ఏం చేస్తుంది?
ఎవర్ గ్రాండ్ 1996లో ప్రారంభమైంది. దీనిని హుయ్ కా యాన్ అనే వ్యక్తి హెంగ్డా గ్రూప్ పేరుతో దక్షిణ చైనాలోని గాంగ్జూ నగరంలో స్థాపించారు. రియాల్టీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది. చైనాలో 280 నగరాల్లో 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇందులో 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, వీటిలో ఇళ్ల కోసం లక్షలాది మంది కొనుగోలుదారులు ముందే అడ్వాన్స్ చెల్లించి ప్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే వీరు చెల్లించిన మొత్తం తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ రుణాలు ఉన్న కంపెనీగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ దివాలా తీస్తే ఉద్యోగుల భవిష్యత్తు ఆందోళనకరం. ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దారుణ పరిస్థితిలో ఉంది. మెటీరియల్ పంపిణీదారులకు కొన్ని నెలలుగా చెల్లింపులు జరపడం లేదు. ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందులు చైనాలో ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన రియాల్టీ ప్రాజెక్టులపై పడనుంది. ఎక్కువగా రుణాలతో నడుస్తున్న స్థిరాస్థి కంపెనీ. 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులతో పాటు విద్యుత్ వాహనాలు, ఇంటర్నెట్, మీడియా కంపెనీ, థీమ్ పార్క్, మినరల్ వాటర్, ఫుడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. చైనా రియాల్టీ మార్కెట్లో దీని వాటా రెండు శాతం. గత ఏడాది నుండి లిక్విడిటీ సమస్య ప్రారంభమైంది.
లేమన్ బ్రదర్స్ వలె...
2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తీసింది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఎవర్ గ్రాండ్ దివాలా అంచున ఉండటంతో మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోందని నిపుణుల ఆందోళన. ప్రాజెక్టుల పరంగా, ఆర్థిక కార్యకలాపాల పరంగా ఎవర్ గ్రాండ్ చేపట్టినవి ఎక్కువే. ఈ సంస్థ జారీ చేసిన బాండ్స్ పైన సెప్టెంబర్ 23వ తేదీన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాలి. కానీ దీనిని చెల్లించలేమని కూడా ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు షాక్ అయ్యారు. 2023 మిడిల్ నాటికి 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) రుణాలు తీర్చాలని భావిస్తోంది కానీ, కానీ సరైన ప్రణాళిక లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 బిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించింది.
హార్వార్డ్-సింగ్వా వర్సిటీ పరిశోధన ప్రకారం చైనా జీడీపీలో 29 శాతం వరకు రియాల్టీ రంగం నుండి వస్తోంది. అయితే కొంతకాలంగా రియాల్టీ రంగం మందగించింది. ఇది ఎవర్ గ్రాండ్ పైన తీవ్ర ప్రభావం చూపింది. గత నెలలో ఇళ్ల విక్రయాల ఇరవై శాతం పడిపోయాయి. ప్రస్తుతం 6.5 కోట్ల ప్రాపర్టీ అమ్ముడుపోకుండా ఉంది. ఎవర్ గ్రాండ్ బ్రాండ్ నేపథ్యంలో పలు దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి. ప్రపంచస్థాయి బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు, సావరీన్ వెల్త్ ఫండ్స్ ఉన్నాయి. చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ బాండ్స్ కనీసం పది శాతం ఈల్డింగ్స్ ఇవ్వడం ఆకర్షించింది. దీంతో ఇన్వెస్ట్ చేశాయి.
చైనా ప్రభుత్వం గట్టెక్కిస్తుందా?
ఎవర్ గ్రాండ్ను సంక్షోభం నుండి బయటపడేసేందుకు చైనా ప్రభుత్వం చేస్తుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవర్ గ్రాండ్ గతంలోనే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. దీంతో పీపుల్స్ బ్యాంక్ ఆప్ చైనా.. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ విచ్చలవిడిగా రుణాలు తీసుకోకుండా గత సంవత్సరం(2020)లో కళ్లెం వేసింది. అంతేకాదు, బ్యాంకు సూచించిన త్రీరెడ్ లైన్స్ లేదా మూడు నిబంధనలను దృష్టిలో పెట్టుకొని రుణదాతలు రుణాలు ఇవ్వాలని కూడా పేర్కొంది. గత జూన్ నాటికి ఎవర్ గ్రాండ్ త్రీరెడ్ లైన్స్ నిబంధనలను అందుకోలేదు. అప్పులపై చైనా కొత్త నిబంధనల నేపథ్యంలో ఎవర్ గ్రాండ్ వంటి కంపెనీలు అప్పులు చెల్లించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం ఆదుకుంటేనే పరిస్థితి సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫిచ్ రేటింగ్స్ జూన్ 23న ఎవర్ గ్రాండ్ రేటింగ్ను బీ ప్లస్ నుండి బీకి కుదించింది.
ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే...
ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం ప్రారంభమవుతుంది. చైనీయుల సంపదలో చాలా భాగం రియాల్టీ రంగంలో ఉంది. ఎవర్ గ్రాండ్ దివాలా తీస్తే చైనీయుల వ్యయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. చైనా బాండ్ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. చైనా జీడీపీతో పోలిస్తే ఇప్పుడున్న 92 ట్రిలియన్ డాలర్ల అప్పు 353 శాతం ఎక్కువ. రియాల్టీ రంగం మరింత మందగిస్తే చైనాకు ఆర్థికంగా పెను ఇబ్బందులే. చైనా వద్ద 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అమెరికా బాండ్స్ ఉన్నాయి.. రుణ చెల్లింపుల కోసం వీటి విక్రయాలు లేదా యువాన్ వ్యాల్యూ తగ్గించడాలు చేయవచ్చు. అప్పుడు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం పడుతుంది. ఆసియాతో పాటు ప్రపంచ దేశాలకు చైనా అతిపెద్ద లేదా కీలక వాణిజ్య భాగస్వామి. ఆ దేశాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. చైనా కరెన్సీ యువాన్ వ్యాల్యూ పడిపోతే చైనా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలోకి మరింతగా వస్తాయి. ఇప్పటికే చైనా, అంతర్జాతీయ మార్కెట్లపై ఎవర్ గ్రాండ్ ప్రభావం కనిపించింది. నిన్న స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.