సెప్టెంబర్ క్వార్టర్లో చైనా వృద్ధి రేటు 4.9 శాతం
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అయితే అన్ని దేశాలతో పోలిస్తే చైనా వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. తాజాగా జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో డ్రాగన్ దేశం 4.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. కరోనా దెబ్బతో ఈ క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో 6.8 శాతం ప్రతికూలతను నమోదు చేసింది. 44 ఏళ్ల తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ మొదటిసారి దారుణంగా పతనమైంది.
ప్రపంచ దేశాల్లో అదుర్స్, అందుకే వేగంగా పుంజుకుంటోన్న చైనా
రెండో క్వార్టర్లో జీడీపీ 3.2 శాతం వృద్ధి సాధించగా, మూడో త్రైమాసికంలో మరింతగా పెరిగి 4.9 శాతం నమోదు చేసింది. కరోనా సమయంలో అన్ని దేశాలు ప్రతికూలత నమోదు చేస్తుంటే చైనా మాత్రం దాదాపు 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 1976లో దారుణమైన సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా జీడీపీ ఇప్పుడు 2020లో దారుణంగా క్షీణించింది. గత కొన్నేళ్లలో చైనా ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా ముందు ఉన్నది.
1992లో చైనా క్వార్టర్లీ జీడీపీని ప్రారంభించింది. అప్పటి నుండి అత్యంత చెత్త జీడీపీ 2020 మొదటి క్వార్టర్లో నమోదు చేసింది. అయితే కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తిప్పికొట్టి వేగంగా వృద్ధిబాట పట్టింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం వెల్లడించింది.