పుతిన్-జిన్పింగ్ ఇక ఒకే జట్టు: రష్యాపై ఆంక్షలు ఎత్తేసిన చైనా
బీజింగ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. మూడోరోజు మరింత ఉధృతమైంది. రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ను చుట్టుముట్టాయి. అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వారి దూకుడును ఉక్రెయిన్ ఆర్మీ.. ఎక్కడికక్కడు అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్ను సొంతం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను విఫలం చేస్తోంది. ఈ రెండు దేశాల సైన్యం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోంది.
రష్యాను నిలువరించడానికి అంతర్జాతీయ వేదికలపైనా ప్రయత్నాలు సాగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని- ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తోన్న దేశాలన్నీ రష్యాను దిగ్బంధం చేస్తోన్నాయి. ఇందులో భాగంగా ఆ దేశంపై అనేక రకాల ఆంక్షలను విధించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, రక్షణ శాఖమంత్రి సెర్గెయ్ షొయిగు, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వలేరి గెరాసిమోవ్కు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించాయి.
ఒకవంక ఆయా దేశాలన్నీ రష్యాపై ఆంక్షల మీద ఆంక్షలను విధించుకుంటూ వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- చైనా దీనికి పూర్తి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. చైనాపై విధించిన ఆంక్షలను ఎత్తివేతకు దిగింది. తొలుత- రష్యా నుంచి గోధుమ దిగుమతులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. దీన్ని క్రమంగా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తి వేసేలా చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
మలి విడతలో బార్లీపై ఆంక్షలను ఎత్తేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బీజింగ్లో ఏర్పాటైన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి వ్లాదిమిర్ పుతిన్ హాజరయినప్పుడే ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మళ్లీ పునరుద్ధరణకు నోచుకున్నాయనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. దిగుమతులపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయంటూ అప్పుడే వార్తలు వచ్చాయి. గోధుమ దిగుమతుల విషయంలో ఇదివరకే చైనా కీలక నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ- ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో దాన్ని తక్షణమే అమలు చేసింది.